కాలుష్య మరణాల్లోనూ మొదటి స్థానం | Sakshi
Sakshi News home page

కాలుష్య మరణాల్లోనూ మొదటి స్థానం

Published Fri, Oct 20 2017 5:28 PM

India top at pollution-related deaths

న్యూఢిల్లీ : భారతదేశంలో వాయు, జల, వాతావరణ కాలుష్యాలు పతాకస్థాయిలో కొనసాగుతున్నాయి. ప్రపంచంలో రోజు రోజుకు పెరగుతున్న కాలుష్యం కారణంగా లక్షలాది మంది ప్రజలు మరణిస్తున్నారని, ఈ మరణాల్లో భారత దేశమే అన్ని దేశాలకన్నా అగ్రస్థానంలో ఉందని కాలుష్యం, ఆరోగ్యంపై లాన్సెట్‌ కమిషన్‌ గురువారం విడుదల చేసిన ఓ నివేదికలో వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఒక్క 2015 సంవత్సరంలోనే 90లక్షల మంది మరణించగా, భారత దేశంలో అదే సంవత్సరం 25 లక్షల మంది మరణించారని ఆ నివేదిక పేర్కొంది. 18 లక్షల మంది మృతితో చైనా రెండవ స్థానంలో ఉందని తెలిపింది.

హృదయ సంబంధిత రోగాలు, ఊపిరితిత్తుల క్యాన్సర్‌, శ్వాసకోసంబంధిత వ్యాధుల వల్ల మరణాలు అధికంగా సంభవిస్తున్నాయని సర్వే ప్రకటించింది. భారత్, చైనా దేశాల తర్వాత బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, హైతీ దేశాలు అధిక కాలుష్యంతో బాధ పడుతున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక కాలుష్య నగరంగా వాసిగెక్కిన ఢిల్లీతోపాటు ముంబయి, బెంగళూరు, చెన్నై నగరాల్లో ఈ దీపావళి అనంతరం కాలుష్యం తీవ్రంగా పెరిగింది.

లాన్సెట్‌ జర్నల్‌ సర్వే ముఖ్యాంశాలు

  • 2015లో ప్రపంచవ్యాప్తంగా 6లక్షల 50 వేల మంది కేవలం వాయు కాలుష్యం వల్ల చనిపోయారు.  నీటి కాలుష్యం వల్ల లక్ష 80 వేల మంది, ఇతర కాలుష్యాల వల్ల 8 వేల మంది మృతి చెందారు.
  • అల్ప, మధ్యాదాయ దేశాల్లో కాలుష్యం కారణంగా 92 శాతం ప్రజలు మరణించారు.
  • అత్యంత వేగంగా పారిశ్రామికీకరణ జరుగుతున్న భారత్‌, పాకిస్తాన్‌, చైనా, బంగ్లాదేశ్‌, మడగాస్కర్‌, కెన్యా వంటి దేశాల్లో కాలుష్య మరణాలు అధికంగా ఉంటున్నాయి.
  • 2015లో కాలుష్యం వల్ల అత్యధికంగా 2 లక్షల 50 వేల మంది భారత్‌లో మరణించారు. రెండో స్థానంలో ఉన్న చైనాలో లక్ష 80 వేల మంది చనిపోయారు.
  • ప్రపంచ జనాభాలోని ప్రతి ఆరుగురులో ఒకరు కాలుష్యం కారణంగా చనిపోతున్నారు.
  • ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది కాలుష్యం వల్ల 90 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
  • మృతుల సంఖ్య పెరగడానికి ప్రధానంగా గాలి, నీరు, నేల, రసాయన కాలుష్యాలే కారణమని సర్వే పేర్కొంది.

Advertisement
Advertisement