ఒక్కరోజులో 28,637 మందికి
రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు
గత 24 గంటల్లో 551 మంది బాధితులు మృతి
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి మరింత పెరుగుతోంది. పాజిటివ్ కేసులు 9 లక్షలకు, మరణాలు 23 వేలకు చేరువవుతున్నాయి. 24 గంటల్లో రికార్డు స్థాయిలో 28,637 కొత్త కేసులు బయటపడ్డాయి. మరో 551 మందిని కరోనా పొట్టనపెట్టుకుంది. దీంతో దేశంలో ఇప్పటిదాకా మొత్తం కేసులు 8,49,533కు, మరణాలు 22,674కు చేరాయని కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం ప్రకటించింది. కరోనా బాధితుల్లో ఇప్పటివరకు 5,34,620 మంది çకోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2,92,258. మహారాష్ట్రలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. రాష్ట్రంలో 2,46,600 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 10,116 మంది మృతి చెందారు.
రికవరీ రేటు 62.93 శాతం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం, సమర్థవంతమైన క్లినికల్ మేనేజ్మెంట్తో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలియజేసింది. కరోనా రికవరీ రేటు 62.93 శాతానికి చేరిందని పేర్కొంది. యాక్టివ్ కేసుల కంటే రికవరీలు 2,42,362 అధికమని గుర్తుచేసింది. 24 గంటల్లో 19,235 మంది కరోనా బాధితులు చికిత్సతో కోలుకున్నారు. దేశంలో 1,370 కోవిడ్ హాస్పిటళ్లు, 3,062 కోవిడ్ హెల్త్ సెంటర్లు, 10,334 కోవిడ్ కేర్ సెంటర్లు ఉన్నాయని కేంద్రం వెల్లడించింది.