మూడు రాష్ట్రాలుగా విడగొట్టాలి | Trifurcate the state, bandlamudi demands | Sakshi
Sakshi News home page

మూడు రాష్ట్రాలుగా విడగొట్టాలి

Aug 28 2013 4:18 AM | Updated on Aug 17 2018 2:08 PM

ఆంధ్రప్రదేశ్‌ను ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ రాష్ట్రాలుగా విభజించాలని ఆచార్య ఎన్‌జీ రంగా ఫౌండేషన్ అధ్యక్షుడు బండ్లమూడి సుబ్బారావు కోరారు.

పర్చూరు, న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్‌ను ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ రాష్ట్రాలుగా విభజించాలని ఆచార్య ఎన్‌జీ రంగా ఫౌండేషన్ అధ్యక్షుడు బండ్లమూడి సుబ్బారావు కోరారు. మండలంలోని వీరన్నపాలెంలో మంగళవారం ఎన్‌జీ రంగా ఫౌండేషన్, ఆంధ్రా జాయింట్ యాక్షన్ కమిటీలు కలిసి ప్రత్యేకాంధ్ర ఉద్యమ కార్యాచరణ కోసం సమావేశం ఏర్పాటు చేశాయి. ఈ సందర్భంగా డాక్టర్ బండ్లమూడి సుబ్బారావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ను మూడు రాష్ట్రాలుగా విభజించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి వినతిపత్రం సమర్పించినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్‌ను యూటీగా చేయడంగానీ, శాశ్వత ఉమ్మడి రాజధానిగా చేయడం గానీ అంగీకరించమని,  విజయవాడను ఆంధ్రరాష్ట్ర రాజధాని చేయాలని తీర్మానాలు చేశారు. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటును ముందుచూపుతో వ్యతిరేకించిన ఆచార్య ఎన్‌జీ రంగా ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని తీర్మానంలో పేర్కొన్నారు. 

 
 రాష్ట్రాన్ని విభజించిన తర్వాత ఆంధ్రరాష్ట్రంలో కనీసం మూడు కేంద్ర విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, ఐఐటీ, ఐఐఎంలను ఏర్పాటు చేయాలన్నారు. ఉద్యోగుల సీనియారిటీకి సంబంధించి ప్రస్తుత పద్ధతిలో ఎలాంటి మార్పులు చేయరాదని, ఉద్యోగులు ఏప్రాంతంలో ఉద్యోగాలు చేస్తామంటే ఆప్రాంతంలోనే ఉద్యోగాలు చేసుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. సమావేశానికి మాజీ ఎమ్మెల్యే మద్దుకూరి నారాయణరావు, ప్రత్యేకాంధ్ర సాధన సమితి కన్వీనర్ సుంకర కృష్ణమూర్తి, ప్రత్యేకాంధ్ర ఉద్యమానికి ఆద్యుడు మాగంటి సాయిరామారావు, ప్రత్యేకాంధ్ర ఉద్యమ రాష్ట్ర నాయకుడు వేములపల్లి వెంకట్రావు, షేక్ అహ్మద్‌బాషా, దేవిరెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి, పొట్లూరి నాగమల్లేశ్వరరావు, ఘట్టమనేని అయ్యన్న, పౌరహక్కుల సంఘ రాష్ట్ర నాయకుడు కే కనకయ్య తదితరులు హాజరయ్యారు.
 

Advertisement
 
Advertisement
Advertisement