అభిషేక ప్రియుడికి శత రుద్రాభిషేకం
యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా కొనసాగుతున్న పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఆదివారం నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా మహా శివుడికి, ముఖ మండపంలోని స్పటిక లింగానికి, ప్రథమ ప్రాకార మండపంలోని మహా శివుడికి ఉదయం భక్తులచే అభిషేకాలు జరిపించిన పూజారులు.. రాత్రి లింగోద్భవ కాలంలో శత రుద్రాభిషేకం జరిపించారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని ఆదివారం ఉదయం విశేష పూజలు జరిపారు. బ్రాహ్మణోత్తములచే నిత్య హవనములు, శివ పంచాక్షరీ జపములు, నందీశ్వర పారాయణములు, పంచసూక్త పఠనములు, మూలమంత్ర జపములు, వివిధ పారాయణములు నిర్వహించారు. మహాశివుడికి పాలు, పెరుగు, నెయ్యి, తేనెతో అభిషేకం చేశారు. ఆయా పూజా కార్యక్రమాల్లో ప్రధానార్చకులు, పారాయణీకులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. కొండపైన ప్రధాన శివాలయానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఉపవాస్య దీక్షలను విరమించారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు..
సాయంత్రం శివాలయం మాడ వీధుల్లో యాదగిరిగుట్టకు చెందిన యాదాద్రి సేవా సమితి, గుండ్లపల్లికి చెందిన వీరప్రతాప మారుతి భజన మండలి ఆధ్వర్యంలో భజన నిర్వహించారు. అనంతరం బ్రహ్మశ్రీ బాచంపల్లి సంతోష్కుమార్ శాస్త్రిచే శివ పురాణ ప్రవచనం జరిపించారు. కుమారి జ్యోతి కూచిపూడి నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. ఒగ్గు శ్రీను బృందంచే ఒగ్గు కథ భక్తులను ఆధ్యాత్మిక వాతావరణంలోకి తీసుకెళ్లింది.


