ప్రకృతిని రక్షిస్తూ వైజ్ఞానికంగా ఎదగాలి
ప్రకృతి కవి జయరాజు
నర్సంపేట రూరల్: ప్రకృతిని రక్షిస్తూ వైజ్ఞానికంగా ఎదగాలని ప్రముఖ ప్రకృతి కవి, రచయిత, కాళోజీ నారాయణరావు అవార్డు గ్రహీత జయరాజు అన్నారు. విజ్ఞాన దర్శిని, దినెహ్రు సెంటర్ నేచర్ ఫౌండేషన్ సంస్థలు ప్రారంభించిన ప్రకృతి వైజ్ఞానిక యాత్ర సోమవారం నర్సంపేటకు చేరింది. ఈ సందర్భంగా పట్టణంలోని తెలంగాణ గిరిజన గురుకుల కళాశాలలో అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జయరాజు మాట్లాడుతూ ప్రకృతిని కాపాడుకోవాలని, ప్లాస్టిక్ను వీలైనంత వరకు నిషేధించాలన్నారు. ముఖ్యంగా తిను పదార్ధాల చోట పూర్తిగా నిషేధించాలన్నారు. ఎక్కువగా మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజా శాస్త్రవేత్త రమేష్, కళాశాల ప్రిన్సిపాల్ సంగీత్ సాగర్, వైస్ ప్రిన్సిపాల్ రవీందర్రెడ్డి, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
ఉపాధ్యాయుడి సస్పెన్షన్
కాళోజీ సెంటర్: ఖిలావరంగల్ మండలం లోతుకుంట జీపీ పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న మనుపాటి రవిపై వచ్చిన ఆరోపణల కారణంగా ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు డీఈఓ రంగయ్య నాయుడు తెలిపారు. రవి విధులకు గైర్హాజరై కోర్టు పనులపై వెళ్లినప్పటికీ టీచర్ అటెండెన్స్ రిజిస్టర్లో హాజరైనట్లు సంతకం చేశారని, ఈ ఆరోపణపై విచారణ జరపగా రుజువు కావడంతో ఎంఈఓ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా కలెక్టర్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేసినట్లు డీఈఓ తెలిపారు.
రాష్ట్రస్థాయి గేమ్స్మీట్కు తరలిన విద్యార్థులు
కాళోజీ సెంటర్: హైదరాబాద్ దోమగూడలోని ప్రభుత్వ వ్యాయామ పాఠశాలలో నేడు (మంగళవారం) జరగనున్న రాష్ట్రస్థాయి ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల గేమ్స్మీట్కు జిల్లా విద్యార్థులు తరలివెళ్లారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ సమ్మిళిత విద్యావిభాగం సిబ్బందితో పాటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రత్యేక బస్సులో తరలివెళ్లారు. ఈ మేరకు సోమవారం డీఈఓ రంగయ్యనాయుడు జెండా ఊపి బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 24 మంది ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులు, 14 మంది తల్లిదండ్రులు, 10 మంది సమ్మిళిత విద్యా ప్రత్యేక బోధకులు రాష్ట్ర స్థాయి గేమ్స్మీట్లో పాల్గొననున్నట్లు డీఈఓ తెలిపారు. కార్యక్రమంలో సమ్మిళిత విద్యా కోఆర్డినేటర్ డాక్టర్ కట్ల శ్రీనివాస్, ఏఎంఓ సుజన్తేజ, జీసీడీఓ ఫ్లోరెన్స్ తదితరులు పాల్గొన్నారు.
ఇంటర్ వార్షిక పరీక్షలకు ఏర్పాట్లు
● డీఐఈఓ శ్రీధర్ సుమన్
కాళోజీ సెంటర్: జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఐఈఓ శ్రీధర్ సుమన్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ఈనెల 25 నుంచి మార్చి 18వ తేదీ వరకు జరిగే ఇంటర్ వార్షిక పరీక్షలకు జిల్లాలో 26 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతీ సెంటర్లో సీసీ కెమెరాలు, గోడ గడియారం, డ్యుయల్ డెస్క్లతో పాటు మౌలిక వసతులు కల్పించామన్నారు. ప్రథమ సంవత్సరం జనరల్ కోర్సులో 5,210 మంది, ఒకేషనల్ కోర్సులో 793 మంది, మొత్తం 6,003 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరంలో జనరల్ కోర్సులో 5,356 మంది, ఒకేషనల్ కోర్సులో 807 మంది, మొత్తం 6,163 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు వివరించారు. పరీక్షల విధుల్లో ఇన్విజిలెటర్లు 380 మంది, ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ 1, సిట్టింగ్ స్క్వాడ్ 4, కస్టోడియన్స్ వరంగల్ 2, నర్సంపేట 2, చీఫ్ సూపరింటెండెట్లు 26, అడిషనల్ సీఎస్ 7, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు 26, మెడికల్ సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. ఈనెల 19 నుంచి హాల్టికెట్లు అందుబాటులో ఉంటాయని, ప్రైవేట్ కళాశాలల యాజమాన్యం హాల్టికెట్ ఇవ్వని పక్షంలో ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకోని పరీక్షకు హాజరు కావచ్చన్నారు. విద్యార్థులకు ఏమైన ఇబ్బందులు ఎదురైతే 99668 88118, 89770 81640 నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు.
ప్రకృతిని రక్షిస్తూ వైజ్ఞానికంగా ఎదగాలి
ప్రకృతిని రక్షిస్తూ వైజ్ఞానికంగా ఎదగాలి


