వనపర్తి: వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ట్యాబ్ ఎంట్రీల్లో వేగం పెంచి రైతుల ఖాతాల్లో వీలైనంత త్వరగా నగదు జమ చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో వరి ధాన్యం కొనుగోళ్ల పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి కేంద్రాల వారీగా ధాన్యం సేకరణ ప్రక్రియపై ఆరా తీసి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రాల్లో ఇప్పటికే తూకం చేసి తరలింపునకు సిద్ధంగా ఉన్న ధాన్యాన్ని తరలించేందుకు సరిపడా లారీలను సమకూర్చాలని, లేకుంటే చర్యలు తప్పవని కాంట్రాక్టర్లను హెచ్చరించారు. జిల్లాలో నేటి నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ధాన్యం కుప్పలు, వాహనాల్లో లోడ్ చేసిన ధాన్యంపై టార్పాలిన్లు కప్పి ఉంచాలన్నారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీ విశ్వనాథ్, జిల్లా పౌరసరఫరాల కార్పొరేషన్ మేనేజర్ ఆంజనేయులు, డీఆ ర్డీఓ ఉమాదేవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.


