సకలజనులసంక్షేమమే ధ్యేయం | - | Sakshi
Sakshi News home page

సకలజనులసంక్షేమమే ధ్యేయం

Jun 3 2026 12:15 AM | Updated on Jun 3 2026 12:15 AM

‘గృహజ్యోతి’కి రూ.51.98 కోట్లు..

జిల్లాలో ఇప్పటి వరకు 84,906 కుటుంబాలు గృహజ్యోతి పథకాన్ని సద్వినియోగం చేసుకుంటుండగా.. ప్రభుత్వం రూ.51.98 కోట్లు వెచ్చించినట్లు వెల్లడించారు. జిల్లాలో ఇప్పటి వరకు 378 మంది రైతు కుటుంబాలకు రైతుబీమా వర్తింపజేయగా.. నామిని ఖాతాలో రూ.18.90 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. అలాగే 1,82,262 లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తుండగా.. 25,167 కొత్త రేషన్‌ కార్డులతో పాటు 1.57 లక్షల మంది అదనపు కుటుంబ సభ్యులను కూడా ఇదివరకే ఉన్న కార్డులలో చేర్చామన్నారు.

5,970

ఇందిరమ్మ ఇళ్లు మంజూరు..

పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందన్నారు. ఇప్పటి వరకు జిల్లాకు 5,970 ఇళ్లు మంజూరుకాగా.. 86 శాతం ఇళ్ల పనులు కొనసాగుతున్నాయని, 1,063 తుది దశకు చేరుకున్నట్లు తెలిపారు. ఈ పథకం కింద రూ.125.19 కోట్లు వెచ్చించినట్లు చెప్పారు. అదేవిధంగా 2వ విడతలో ప్రతి నియోజకవర్గానికి 2 వేల ఇళ్లు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.

వనపర్తి: సకలజనుల సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తోందని శాసనమండలి చీఫ్‌ విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం సమీకృత కలెక్టరేట్‌లో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి, ఎస్పీ సునీతారెడ్డి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డితో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రగతి నివేదికను చదివి వినిపించారు.

మహిళలకు వరం ‘మహాలక్ష్మి’..

ప్రజా ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చాక మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో పాటు వారు వ్యాపార రంగంలో రాణించి ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తోందన్నారు. మహిళాశక్తి పథకంలో భాగంగా జిల్లాలో మండల మహిళా సమాఖ్యల నుంచి 12 బస్సులను కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకు ఇచ్చినట్లు వెల్లడించారు. ప్రతి మండల మహిళా సమాఖ్యకు నెలకు సుమారు రూ.69 వేల చొప్పున రూ.8.33 లక్షల ఆదాయం సమకూరుతోందన్నారు. అమరచింత, వనపర్తి మండలాల మహిళా సమాఖ్యలకు ‘కుసుమ్‌ ప్రాజెక్టు‘ ద్వారా సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటుకుగాను రూ.60 లక్షలు మంజూరు చేశామని తెలిపారు. కొత్తకోట మండలం మిరాసిపల్లిలో ఎకరా స్థలంలో మహిళా సంఘాలతో రూ.2 కోట్లతో పెట్రోల్‌బంక్‌ ఏర్పాటుకు శంకుస్థాపన చేశామన్నారు. జిల్లాలోని 1,27,715 మంది మహిళాసంఘ సభ్యులకు ఇందిరా మహిళాశక్తి చీరలు పంపిణీ చేసినట్లు చెప్పారు. జిల్లా మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి రూ.5 కోట్లు మంజూరయ్యాయని.. పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా జిల్లాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 10,536 మంది రూ.32.14 కోట్ల విలువైన వైద్య సేవలు విని యోగించుకున్నట్లు వెల్లడించారు.

ప్రగతి నివేదిక చదువుతున్న చీఫ్‌ విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు..

జిల్లాలోని వివిధ పాఠశాలలు, బాలభవనం చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక పర్యావరణ వారోత్సవాల్లో భాగంగా పర్యావరణ అవగాహనలో ప్రతిభ చాటిన వనపర్తి జెడ్పీహెచ్‌ఎస్‌ బాలికలు, కొత్తకోట జెడ్పీహెచ్‌ఎస్‌ బాలికలు, పెబ్బేరు కేజీబీవీ పాఠశాలల విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఖీమ్యానాయక్‌, వినోద్‌కుమార్‌, అదనపు ఎస్పీ రాజేష్‌ మీనా, ఏఆర్‌ అదనపు ఎస్పీ వీరారెడ్డి, పుర చైర్‌పర్సన్‌ మాధవి, జిల్లా అధికారులు, వనపర్తి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌గౌడ్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మధుసూదన్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement