మహాన్కు సీక్వెల్ ఆలోచన
తమిళసినిమా: నటుడు విక్రమ్,ఆయన వారసుడు ధ్రువ్ విక్రమ్ కలిసి నటించిన తొలి చిత్రం మహాన్. నటి సిమ్రాన్, బాబీసింహా, సనత్, వాణిబోజన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం 2022లో నేరుగా ఓటీటీలో విడుదలయ్యింది. అలాగే చిత్రానికి మంచి పేరు కూడా వచ్చింది. విమర్శకులు సైతం ప్రశంసించారు. ముఖ్యంగా నటుడు ధ్రువ్ విక్రమ్ నటన ప్రశంసనీయంగా ఉందనే అభినందనలను ఆయన అందుకున్నారు.దీన్ని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించారు. కాగా వైవిధ్యభరిత కథా చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఈయన ఇటీవల సూర్య హీరోగా రెట్రో అనే చిత్రానికి దర్శకత్వం వహించి కమర్శియల్ హిట్ను అందుకున్నారు. కాగా ప్రస్తుతం ఈయన అవార్డుల కోసం ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దీంతో తదుపరి చిత్రం ఏమిటన్న ఆసక్తి నెలకొంది. ఇలాంటి పరిస్థిఽతుల్లో ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ వద్ద మహాన్ చిత్రానికి సీక్వెల్ చేసే ఆలోచన ఉందా ? అన్న ప్రశ్నకు కచ్చితంగా ఉందన్నారు. అయితే అందుకోసం కథను సిద్ధం చేయాల్సి ఉందని చెప్పారు. అది 2027లో కానీ, 2028లో గానీ తెరకెక్కే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. దీంతో విక్రమ్, ధ్రువ్ విక్రమ్ను కలిసి మరోసారి వెండితెరపై చూడవచ్చన్న మాట.


