ప్రజలను మరోసారి వంచించారు
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ మండిపాటు
పెనుకొండ రూరల్: అంకెల గారడీ బడ్జెట్తో రాష్ట్ర ప్రజలను సీఎం చంద్రబాబు మరోసారి వంచించారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ మండిపడ్డారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. బడ్జెట్లో ఆడబిడ్డ నిధి పథకానికి నిధులు కేటాయించకపోవడం అన్యాయమన్నారు. ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ. 1,500 ఇస్తామని ఎన్నికల ముందు ఆర్భాటంగా ప్రకటించిన చంద్రబాబు నేడు నిలువునా దగా చేశారన్నారు. తల్లికి వందనం సంపూర్ణంగా అమలు చేయలేదని, ఏకంగా 20 లక్షల మంది తల్లులకు మొండిచేయి చూపారని దుయ్యబట్టారు. ‘నీకు పదిహేను వేలు.. నీకు పదిహేను వేలు’ అంటూ చెవిలో పూలు పెట్టారన్నారు. దీపం–2 పథకానికి రూ.4,500 కోట్లు అవసరముంటే కేవలం రూ. 2,600 కోట్లు కేటాయించడం దుర్మార్గమన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ కింద చిల్లిగవ్వ కూడా చంద్రబాబు ప్రభుత్వం ఇవ్వలేక పోయిందన్నారు. పథకాలకు కేటాయింపులు లేకున్నా ద్రవ్య లోటు రూ. లక్షల కోట్లకు చేరుతుండడం ఆందోళన కలిగిస్తోందన్నారు.


