తప్పుల తడకగా ‘డ్యాష్‌ బోర్డు’ | - | Sakshi
Sakshi News home page

తప్పుల తడకగా ‘డ్యాష్‌ బోర్డు’

Feb 16 2026 7:41 AM | Updated on Feb 16 2026 7:41 AM

తప్పుల తడకగా ‘డ్యాష్‌ బోర్డు’

తప్పుల తడకగా ‘డ్యాష్‌ బోర్డు’

అనంతపురం క్రైం: ముఖ్యమంత్రి చంద్రబాబు నోరు తెరిస్తే చాలు కాగిత రహిత పాలన అంటూ ఊదర కొడుతుంటారు. అయితే ఆయన మాటలకు చేతలకు ఏం సంబంధం ఉండదని ఎన్నోసార్లు రుజువైంది. కమిషనర్‌, డ్రైరెక్టర్‌ ఆఫ్‌ మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ (సీడీఎంఏ) డ్యాష్‌బోర్డ్‌ కూడా దాన్నే స్పష్టం చేస్తోంది. ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సేవల వివరాలను ఎప్పటికప్పుడు డ్యాష్‌ బోర్డులో అందుబాటులో ఉంచాలి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఈ వివరాలన్నీ సమగ్రంగా పొందుపరిచేవారు. సచివాలయాల వ్యవస్థను తీసుకువచ్చాక, ఈ పరిస్థితి మరింత మెరుగ్గా సాగింది. అయితే కూటమి ప్రభుత్వంలో డ్యాష్‌ బోర్డు తప్పుల తడకగా మారింది.

సిబ్బంది ఉన్నా హాజరు శాతం సున్నా...

డ్యాష్‌బోర్డ్‌లో నమోదువుతున్న యూఎల్‌బీ హాజరు గణాంకాలు అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో శానిటేషన్‌ విభాగం పనితీరుపై సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. అనంతపురం నగరంలో శానిటేషన్‌ విభాగంలో మొత్తం 586 మంది సిబ్బంది ఉండగా హాజరులో 0 శాతంగా చూపించారు. ఇందులో 450 మంది పీహెచ్‌ వర్కర్లు, 35 మంది డ్రైవర్లు, 60 మంది లోడర్లు, 41 మంది సూపర్‌ వైజర్లు ఉన్నారు. గుత్తి 92 మంది, గుంతకల్‌ 200 మంది, కళ్యాణదుర్గం 57 మంది, రాయదుర్గం 128 మంది, తాడిపత్రి 172 మంది ఉన్నా జీరో శాతంగా నమోదైంది. ఇదే పరిస్థితే శ్రీసత్యసాయి జిల్లాలోనూ కనిపిస్తోంది. ధర్మవరం 198 మంది, హిందూపురం 314 మంది, కదిరి 175 మంది, మడకశిర 29 మంది, పుట్టపర్తి 62 మంది ఉన్నా సిబ్బంది హాజరు శాతం సున్నాగా నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.

ఉన్నతాధికారుల నిర్లక్ష్యంతోనే..

వందలాది మంది ఉద్యోగులు ఉన్నప్పటికీ హాజరు నమోదు లేకపోవడం శానిటేషన్‌ సేవలు స్తంభించాయా లేక అటెండెన్స్‌ నమోదు చేయలేదా అన్న అనుమానాలకు తావిస్తోంది. ఈ గణాంకాలు పూర్తిస్థాయిలో అప్‌డేట్‌ కాలేదని భావించినా కార్యాలయాల్లో ఏరోజుకారోజు నమోదు చేయాల్సిన సిబ్బంది హాజరు వివరాలపై నిర్లక్ష్యంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. బయోమెట్రిక్‌ లేదా ఆ్‌లైన్‌ అటెండెన్స్‌ వ్యవస్థ సక్రమంగా పర్యవేక్షించకపోవడం, స్థానిక స్థాయిలో అధికారులు రోజువారీ సమీక్షలు చేయకపోవడం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే ఇలా జరుగుతోందని అంటున్నారు.

కీలక సేవలపై ప్రతికూల ప్రభావం

శానిటేషన్‌ సిబ్బంది హాజరును సున్నాగా చూపబడటంతో చెత్త సేకరణ, డ్రైనేజీ శుభ్రత, ప్రజారోగ్య పరిరక్షణ వంటి కీలక సేవలపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉంది. ముఖ్యంగా దోమల వ్యాప్తి, చెత్త పేరుకుపోవడం, సంక్రమణ వ్యాధుల ప్రమాదం పెరగవచ్చు. అందువల్ల సీడీఎంఏ స్థాయిలోనే తక్షణ సమీక్ష నిర్వహించి, రోజువారీ హాజరు నమోదు తప్పనిసరి చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవడం అవసరం. డ్యాష్‌బోర్డ్‌లోని గణాంకాలు కేవలం సంఖ్యలు కాకుండా పట్టణ శుభ్రత వ్యవస్థలో ఉన్న లోపాలను బహిర్గతం చేస్తున్న హెచ్చరిక సంకేతాలుగా భావించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

సీడీఎంఏ డ్యాష్‌బోర్డులో శానిటేషన్‌ సిబ్బంది హాజరు చూపని అధికారులు

కీలక సేవలపై ప్రతికూల ప్రభావం

పట్టించుకోని ఉన్నతాధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement