బంగ్లాదేశ్తో తొలి వన్డేలో ఎదురైన ఘోర పరబాభావానికి పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంది. శుక్రవారం ఢాకా వేదికగా జరిగిన రెండో వన్డేలో 128 పరుగుల భారీ తేడాతో (డీఎల్ఎస్ పద్దతి ప్రకారం) ఆతిథ్య బంగ్లాను పాక్ చిత్తు చేసింది. దీంతో మూడు వన్డేల సిరీస్ను మెన్ ఇన్ గ్రీన్ 1-1తో సమం చేసింది.
ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 47.3 ఓవర్లలో 274 పరుగులకు ఆలౌట్ అయ్యింది. పాక్ బ్యాటర్లలో యువ ఆటగాడు మాజ్ సదాకత్ (75) టాప్ స్కోరర్గా నిలవగా.. సల్మాన్ ఆఘా (64), మహమ్మద్ రిజ్వాన్ (44) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. అనంతరం లక్ష్య చేధనకు దిగిన బంగ్లాదేశ్ 15 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ సమయంలో ఆటకు వర్షం కూడా అంతరాయం కలిగించింది. భారీ వర్షం, వడగళ్ల వాన కారణంగా ఆట రెండు గంటల పాటు నిలిచిపోయింది. ఆ తర్వాత డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం బంగ్లాదేశ్ లక్ష్యాన్ని 32 ఓవర్లలో 243 పరుగులుగా కుదించారు. కానీ ఆట తిరిగి మొదలయ్యాక కూడా బంగ్లా వికెట్ల పతనం కొనసాగింది.
లిటన్ దాస్ (41) కాసేపు పోరాడినా, అతనికి ఇతర బ్యాటర్ల నుంచి సహకారం అందలేదు. దీంతో బంగ్లా జట్టు కేవలం 23.3 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూలింది. పాకిస్తాన్ బౌలర్లలో మాజ్ సదాకత్, హారిస్ రవూఫ్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. షాహిన్ అఫ్రిది రెండు వికెట్లు సాధించాడు. ఇక సిరీస్ డిసైడర్ మూడో వన్డే మార్చి 15న ఇదే వేదికలో జరగనుంది.
చదవండి: IPL 2026: కేకేఆర్కు మరో భారీ షాక్


