అతడు ఫెయిలైతే చెన్నైది మళ్లీ పాత కథే: సెహ్వాగ్‌ | The day he fails same story Again: Sehwag on CSK 103 run win vs MI | Sakshi
Sakshi News home page

అతడు ఫెయిలైతే చెన్నైది మళ్లీ పాత కథే: సెహ్వాగ్‌

Apr 24 2026 3:07 PM | Updated on Apr 24 2026 3:18 PM

The day he fails same story Again: Sehwag on CSK 103 run win vs MI

ఐపీఎల్‌-2026లో ఇప్పటికి ఏడు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ మూడింట గెలిచింది. ముంబై ఇండియన్స్‌తో గురువారం నాటి మ్యాచ్‌లో ఏకపక్ష విజయం సాధించి పాయింట్ల సంఖ్యను ఆరుకు పెంచుకుంది. సొంతమైదానం వాంఖడేలో ముంబైని చెన్నై చిత్తు చేయడంతో అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

మూడు మ్యాచ్‌లలో రెండు శతకాలు
అయితే, టీమిండియా మాజీ ఓపెనర్‌, కామెంటేటర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ (Virender Sehwag) మాత్రం చెన్నై విషయంలో భిన్నంగా స్పందించాడు. ఒక్కరిపై ఆధారపడితే చెన్నై ఈసారి కూడా గట్టెక్కలేదని అభిప్రాయపడ్డాడు. కాగా చెన్నై ఇప్పటికి మూడు విజయాలు సాధించగా.. ఈ మూడింటిలో సంజూ శాంసన్‌ రెండు అజేయ సెంచరీలతో జట్టును గెలిపించాడు.

ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో 115 పరుగులు చేసిన సంజూ.. తాజాగా ముంబైపై 101 పరుగులు సాధించాడు. ఈ రెండు మ్యాచ్‌లలో మిగతా బ్యాటర్ల నుంచి అతడికి పెద్దగా సహకారం అందలేదు. ఇక కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో మ్యాచ్‌లోనూ సంజూ 48 పరుగులతో టాప్‌రన్‌స్కోరర్‌గా నిలిచి జట్టుకు విజయం అందించాడు.

అతడు ఫెయిలైతే చెన్నైది మళ్లీ పాత కథే
ఈ నేపథ్యంలో వీరేందర్‌ సెహ్వాగ్‌ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం చెన్నై జట్టును అందరూ ప్రశంసిస్తున్నారు. కానీ ఆ జట్టు గెలిచిన ప్రతి సందర్భంలోనే ఒకే ఒక్క బ్యాటర్‌ పరుగులు రాబట్టాడు. అతడు పరుగులు చేయడంలో విఫలమైన రోజు కథ వేరుగా ఉంటోంది.

ఒకవేళ అతడు మళ్లీ గనుక ఫెయిలైతే పాత కథే పునరావృతం అవుతుంది. కాబట్టి ఒకే ఒక్క బ్యాటర్‌పై ఆధారపడటం సరికాదు. సంజూతో పాటు పరుగులు రాబట్టే ఆయుశ్‌ మాత్రే దురదృష్టవశాత్తూ గాయం వల్ల జట్టుకు దూరమయ్యాడు.

కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌, శివం దూబే, డెవాల్డ్‌ బ్రెవిస్‌ మీద చెన్నై ఆశలు పెట్టుకుంది. సంజూతో కలిసి వాళ్లు కూడా రాణిస్తేనే సీఎస్‌కే ప్రయాణం ముందుకు సాగుతుంది’’ అని క్రిక్‌బజ్‌ షోలో పేర్కొన్నాడు. 

ఏదేమైనా సంజూ శాంసన్‌ సంచలన ఇన్నింగ్స్‌తో ముంబైపై చెన్నైకి విజయం అందించాడని సెహ్వాగ్‌ ప్రశంసించాడు.కాగా రికార్డు స్థాయిలో ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన చెన్నై.. కొన్నేళ్లుగా పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. గతేడాది పద్నాలుగింట కేవలం నాలుగు గెలిచి పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది.

చదవండి: ఆకాశ్‌ అంబానీ ఆగ్రహం.. ఇంకేం చూస్తారు?

Advertisement
 
Advertisement
Advertisement