ఒక్కటై కదులుదాం.. బాధ్యతను నిర్వర్తిద్దాం
పోలింగ్ కేంద్రాలకు
ఓటర్లు కదలాలి
షాద్నగర్: ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం.. సకల సమస్యలకు పరిష్కారమార్గం.. నవభారత నిర్మాణానికి పునాది లాంటిది అంతటి ప్రాముఖ్యం ఉన్న ఓటును సక్రమంగా వినియోగించుకోవాలి. మున్సిపల్ ఎన్నికల్లో అత్యంత కీలకమైన పోలింగ్ ప్రక్రియ బుధవారం ప్రారంభం కానుంది. ఇన్నాళ్లు నిద్రాహారాలు మాని ప్రచారం చేసిన నేతల భవిత వ్యం బ్యాలెట్ పత్రం రూపంలో ఎన్నికల డబ్బాలో పదిలమవుతుంది. ఐదేళ్ల కాలానికి తమను పాలించేదెవరో ఓటరు దేవుడు నిర్ణయించబోతున్నారు. రాజకీయ పక్షాలతో పాటుగా ఈ ఎన్నికలు అధికార యంత్రాంగానికి ప్రతిష్టాత్మకంగా మారాయి. గెలుపే ధ్యేయంగా అన్ని పార్టీలు పావులు కదిపితే.. పోలింగ్ ప్రక్రియలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే దిశగా అధికారులు సిద్ధమయ్యారు.
ఓటు పోటెత్తాలి
ఒక్క ఓటుతోనే నాయకుల తలరాతలు మారుతాయి. ప్రజాస్వామ్యంలో ఓటు విలువకు ఉన్న ప్రాధాన్యత, విలువ చాలా మందికి తెలియడం లేదు. పట్టణ ప్రాంతాల్లో జరిగే ఎన్నికల్లో పోలింగ్ శాతం బాగా తగ్గుతుంది. ఫలితంగా నిర్ణయాత్మక శక్తి తగ్గి పోతుంది. పల్లె ఓటర్లు చైతన్యం కనబరుస్తున్నా పట్టణ ప్రజలు పోలింగ్ కేంద్రానికి వెళ్లడానికి బద్దకిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లలో చైతన్యం పెరిగితేనే ఓటు శాతం పెరుగుతుంది. ప్రతిఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు తరలిరావాలి.
ఒకటితో తారుమారు
ఐదేళ్లకోసారి తమను పరిపాలించే నాయకులను ఎన్నుకునే అవకాశం ఓటు రూపంలో లభిస్తుంది. ఒక్క ఓటే కదా వేయకపోతే ఏమవుతుందని అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఎన్నికల ఫలితాల్లో ఒకటి, రెండు ఓట్ల తేడాతో ఫలితాలు తారుమారైన సందర్భాలు అనేకం ఉన్నాయి. ప్రజల బాగోగులు పట్టించుకునే వారికి పదవి కట్టబెట్టి, మాయమాటలు చెప్పే వారికి బుద్ధి చెప్పే విలువైన వజ్రాయుధం ఓటు అని అందరూ గుర్తించాలి. ఓటు హక్కును ఉపయోగించుకొని భావితరాల అభివృద్ధికి బాటలు వేసే గురుతర బాధ్యతను స్వీకరించాలి.
గెలుపు నీదే
ఎన్నికల్లో సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకునే అవకాశం రాజ్యాంగం ఓటు హక్కు ద్వారా కల్పించింది. నేతల భవిష్యత్తును ఓటు హక్కు ద్వారా తేల్చవచ్చు. సమర్థుడైన నేతను ఎన్నుకునే మార్గం ప్రజలకు ఓటు రూపంలో ఉంటుంది. మంచి నేత ను ఎన్నుకుంటే ఓటరుదే చివరికి గెలుపు అవుతుంది. అసమర్థుడిని, అవినీతి పరుడికి ఓటు వేస్తే ఓట మి ఓటరుదే అవుతుంది. ఓటర్లు చైతన్య వంతులై నేతలకు ఓటుతో కనువిప్పు కలిగించాలి. ప్రలోభాలను పటాపంచలు చేసి ఓటు అనే ఆయుధాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి. ఐదేళ్ల పాలన సక్రమంగా సాగాలంటే మన చేతుల్లోనే ఉంది.
ప్రజాస్వామ్యాన్ని గెలిపిద్దాం
ఎన్నికలు అనే రణ రంగంలో ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాల్సిన సమయం ఆసన్నమైంది. పట్టణ ఓటర్లు తిరుగులేని నేతను పుర పాలకుడిగా ఎన్నుకోవాలి. అందరూ ఒక్కటై కదులుదాం.. ఎన్నికల పోరులో ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకుందా.. రండి.. కదలిరండి.. ఓటింగ్లో పాల్గొందాం... వందశాతం పోలింగ్ నమోదు చేద్దాం.
చైతన్యంతోనే పోలింగ్ శాతం
పెరుగుదల
పుర ఎన్నికల్లో అంతిమ తీర్పు ఓటరుదే
మార్మోగిన సోషల్ మీడియా
శంకర్పల్లి: మున్సిపల్ ఎన్నికలకు 48గంటలకు ముందే మైకులు మూగబోయాయి. అయితేనేం సోషల్ మీడియా ఉంది కదా. అభ్యర్థులు చివరి రెండు రోజులు సోషల్ మీడియాని ప్రచార అస్త్రాలుగా వాడుకుంటున్నారు. తాము గెలిచేందుకు విరివిగా ఎడిట్ చేసిన ప్రచార వీడియోలు, పాటలు, కరపత్రాలను పెద్ద ఎత్తున వాట్సాప్, ఇన్స్ట్రాగాం, ఎక్స్, ఫేస్బుక్లలో పోస్ట్ చేస్తున్నారు. వీరి ప్రయత్నాలు ఓటర్లను ఏ మేరకు ప్రభావితం చేస్తాయో తేలాల్సి ఉంది.
ఒక్కటై కదులుదాం.. బాధ్యతను నిర్వర్తిద్దాం


