బెదిరింపుతోనే అభ్యర్థి ఆత్మహత్య!
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కిషోర్ రెడ్డి
తాండూరు టౌన్: కాంగ్రెస్ నాయకుల బెదిరింపులతోనే మక్తల్ మున్సిపల్ 6వ వార్డు బీజేపీ అభ్యర్థి ఎరుకలి మహదేవప్ప ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన తాండూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతంలో హత్యా రాజకీయాలతో పాటు.. అభ్యర్థులను బెదిరించడం, దూషించడం, బ్యాలెట్ బాక్సులు ఎత్తుకెళ్లడం లాంటివి ఉండేవన్నారు. కాలక్రమేణా అవి కనుమరుగయ్యాయని, మళ్లీ కాంగ్రెస్తో పునరావృతమయ్యే ప్రమాదం ఏర్పడిందని విమర్శించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పట్టు కోల్పోతున్నామని వచ్చిన ఇంటలిజెన్స్ రిపోర్టుతో అధికార పార్టీ నాయకులు ఇలా బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈ విషయంలో పోలీసులు కల్పించుకొని, బీజేపీ అభ్యర్థులకు రక్షణ కల్పించి, ఎన్నికలు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేష్ కుమార్, మున్సిపల్ ఎన్నికల సహ ఇన్చార్జి వడ్ల శ్రీధర్, తాండూరు కన్వీనర్ మనోహర్ రావు, సహ కన్వీనర్ పటేల్ విజయ్ తదితరులు పాల్గొన్నారు.


