ఘనంగా బాలఏసు ఊరిపండుగ
● తరలివచ్చిన భక్తులు
● ప్రత్యేక ప్రార్థనలు
తుర్కయంజాల్: కమ్మగూడలోని బాలఏసు వార్షిక మహోత్సవంలో భాగంగా ఆదివారం ఊరిపండుగను ఘనంగా నిర్వహించారు. ఉదయం 4 నుంచి ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. ముందుగా గోవిందు ఆరోగ్య స్వామి దివ్యబలిపూజ తెలుగులో, 5 గంటలకు బోనగిరి బాల ఆంథోని, 6 గంటలకు కూరపాటి జయ ప్రతాప్ ఇంగ్లిష్లో, 7 గంటలకు ఈరిపాల్ ప్రభాకర్ తెలుగులో, 8 గంటలకు పాస్టర్ ఏ.ఎస్.టోని తమిళంలో దివ్య బలిపూజలు నిర్వహించారు. 9.30 గంటలకు బాలఏసు మహోత్సవ దివ్య బలిపూజ ఇంగ్లిష్లో తాతిరెడ్డి జయరాజ్ రెడ్డి, 11.30 గంటలకు సిరిల్ తెలుగులో నిర్వహించారు. ఉదయం 6 గంటలకు నగరంలోని బోయిగూడ నుంచి బాలఏసు తేరు ప్రదక్షిణ ప్రారంభం కాగా, 11 గంటలకు తుర్కయంజాల్కు చేరుకుంది. చర్చి కమిటీ సభ్యులు, భక్తులు స్వాగతం పలికారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకు చెందిన భక్తులు వేల సంఖ్యలో బాలఏసును దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. జీహెచ్ఎంసీ ఆదిబట్ల సర్కిల్ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయగా వనస్థలిపురం పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ నగరంలోని పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడిపింది.
ఘనంగా బాలఏసు ఊరిపండుగ


