పారిశుద్ధ్యం.. ప్రజలకు దూరం
● మున్సిపాలిటీల్లో పేరుకుపోతున్న వ్యర్థాలు
● రోడ్లపైనే పారుతున్న మురుగునీరు
● పట్టించుకోని అధికార యంత్రాంగం
చేవెళ్ల: మున్సిపాలిటీల్లో అధికారులు పారిశుద్ధ్యంపై దృష్టి సారించడం లేదు. చేవెళ్ల మున్సిపాలిటీ కేంద్రానికి వార్డులకు దూరం ఎక్కువగా ఉండటంతో కార్మికులు విడతల వారీగా వస్తున్నారు. దీంతో పలు వార్డుల్లో శుభ్రత కనిపిస్తే.. మరికొన్ని వార్డుల్లో అపరిశుభ్రతలు దర్శనమిస్తున్నాయి. కొత్త మున్సిపాలిటీ కావటంతో ప్రజలకు సైతం అవగాహన లేకపోవటంతో ఎవరిని అడగాలో తెలియటం లేదు. వీధి దీపాలు సైతం వెలగడం లేదు. వేసినప్పుడు రాత్రి పగలు తేడా లేకుండా వెలుగుతున్నాయని, ఆగిపోతే మాత్రం పట్టించుకునే నాథుడు లేకుండా పోయారు. ఇళ్ల పక్కన ఉండే ఖాళీ స్థలాల్లో చెత్తాచెదారాలు పేరుకుపోతున్నాయని స్థానికులు వాపోతున్నారు.
వెలగని వీధి దీపాలు
శంకర్పల్లి: మున్సిపాలిటీలోని శంకర్పల్లి చౌరస్తా నుంచి బుల్కాపూర్ వరకు ఉన్న నాలుగు వరుసల రహదారికి వీధి దీపాలను ఏర్పాటు చేయగా.. అవి అంతంత మాత్రంగానే వెలుగుతున్నాయి. దీనిపై ఇప్పటికే పురవాసులు పలుమార్లు ఫిర్యాదు చేసినా నిధులు, విద్యుత్ శాఖ నుంచి సహకారం లేకపోవడంతో ఆ పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. మున్సిపాలిటీలో నిత్యం 12 నుంచి 14 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది. దీనిని తరలించేందుకు ట్రాక్టర్లు, ఆటోలు వినియోగించి డంపింగ్కి తరలిస్తున్నారు. అయితే డంపింగ్ యార్డు నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో అక్కడ ఆకతాయిలు చెత్తకు నిప్పు పెడుతున్నారు. దీంతో పెద్ద ఎత్తున పొగలు వ్యాపించి, చుట్టుపక్కల ఉన్న కాలనీవాసులకు తీవ్ర ఇబ్బంది తలెత్తుతుంది. ఇప్పటికై నా మున్సిపల్ అధికారులు స్పందించి, సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
పట్టించుకునేవారు లేరు
మండల కేంద్రానికి దూరంగా ఉన్న మా గ్రామాన్ని మున్సిపాలిటీలో కలిపి అన్యాయం చేశారు. ఏ సమస్య వచ్చినా మున్సిపల్ కేంద్రంలో ఫిర్యాదు చేయాలంటున్నారు. పంచాయతీ అయితే అందుబాటులోనే ఉండేది. డ్రైనేజీలు సక్రమంగా లేక రోడ్లపైనే మురుగు పారుతోంది. వీధీ లైట్లు సక్రమంగా వెలగటం లేదు. రాత్రిళ్లు ఇబ్బంది పడుతున్నాం.
– విఠల్, మొండివాగు వార్డు, చేవెళ్ల


