
ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడు నియామకానికి సమయం ఆసన్నమైంది. మరికొద్ది రోజుల్లో తెలంగాణ బీజేపీకి నూతన అధ్యక్షుడు రాబోతున్నారనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. మరో మూడు నెలల్లోపే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్న తరుణంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిపై అధిష్టానం తీవ్రంగా దృష్టి సారించింది.
ప్రస్తుతం తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్రెడ్డి స్థానంలో మరొకరి పగ్గాలు అప్పగించేందుకు ఇప్పటికే అధిష్టానం సిద్ధమైనట్లు తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడి రేసులో ఈటల రాజేందర్తో పాటు ధర్మపురి అరవింద్లు ముందు వరుసలో ఉన్నట్లు సమాచారం. దీనిపై అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లు, వచ్చే నెల ఒకటో తేదీనే ప్రకటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
దీనిలో భాగంగా ఈనెల 30వ తేదీన నామినేషన్ల ప్రక్రియ జరుగనుంది. అదే సమయంలో ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడి నియామకం కూడా జరుగనుంది. ఈ రెండు నామినేషన్ల ప్రక్రియ ఈనెల చివరన నిర్వహించే జూలై 1వ తేదీన కొత్త అధ్యక్షుల్ని ప్రకటించే యోచనలో ఉన్నారు. తెలంగాణ బిజెపి ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా శోభ కరండ్లాంజె నియమించగా, ఏపీ బీజేపీ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా పీసీ మోహన్ను నియమించారు.