సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి పొలిటికల్ హీట్ పెరిగింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పొలిటికల్ ప్రకటన రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. కవిత కొత్త పార్టీ పేరు టీఆర్ఎస్.. తెలంగాణ రాష్ట్ర సేనగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో కవిత పార్టీ పేరు ప్రస్తావన లేకుండానే బీఆర్ఎస్ సెటైరికల్గా వ్యాఖ్యలు చేసింది.
టీఆర్ఎస్ పేరుతో కవిత ఏర్పాటు చేసిన పార్టీపై బీఆర్ఎస్ స్పందించింది. బీఆర్ఎస్ ట్విట్టర్ వేదికగా పోస్టు చేసి.. ఆ పార్టీ పేరు చెప్పకుండానే ట్రోలింగ్ చేసింది. ఇందులో ఒరిజినల్, నకిలీ కోల్గేట్, బిస్లరీ వాటర్ బాటిల్స్ ఫొటోలను పెట్టింది. ఈ సందర్భంగా ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే! అని కామెంట్ చేసింది. దీనిపై నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు.

ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే! pic.twitter.com/YBlx20tlRf
— BRS Party (@BRSparty) April 25, 2026
అయితే, అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ పేరు మార్పుపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంచిర్యాల జిల్లా క్యాతన పల్లిలో బీఆర్ఎస్ కారకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ పార్టీగా మార్చిన తర్వాత నష్టపోయాం. మళ్లీ టీఆర్ఎస్గా ఉండాలని కోరుకుంటున్నాం. ప్రజా సమస్యలపై పాదయాత్ర చేస్తా. మేం తప్పులు చేశాం.. అందుకే ఓడిపోయాం. తల్లిదండ్రులను సంతోష పెట్టకపోయినా పర్వాలేదు.. బాధపెట్టొద్దు. కొత్త పార్టీలు ఎన్ని వస్తే అంత మంచిది.. ఓట్లు వేయాలి కదా. మాకు ఏ పార్టీతో పొత్తులు ఉండవు’ అని స్పష్టం చేశారు. కేటీఆర్ ప్రకటన వచ్చిన కొద్ది రోజుల్లో కవిత ఇలా కొత్త పార్టీ పేరును టీఆర్ఎస్గా ముందుకు తీసుకు రావడం గమనార్హం.


