సాక్షి, హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి పార్టీ నేటితో 26 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఆవిర్భావ వేడుకల దృష్ట్యా ఆ పార్టీ శ్రేణుల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఉదయం 11గం.కు తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జెండాను ఎగరేయనున్నారు. మధ్యాహ్నాం అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ కార్యవర్గ సమావేశం జరగనుంది. అయితే..
ఈ సమావేశంలో కేసీఆర్ ఏం మాట్లాడతారో? అనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది. కొంతకాలంగా నిశబ్దంగా ఉండిపోయిన ఆయన.. మొన్నటి జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉరిమారు. తనదైన శైలిలో మాటల తూటాలు పేల్చి రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా కూడా వ్యక్తం చేశారు. అయితే కొత్త సవాళ్లపై ఆయన స్పందిస్తారా?.. పార్టీ శ్రేణులకు ఎలాంటి దిశానిర్దేశం చేస్తారో? అనే కుతూహలం ఇప్పుడు నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో చోటు చేసుకున్న తాజా పరిణామాలపై తెలుగు రాష్ట్రాల్లోనూ జోరుగా చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. కేసీఆర్ కూతురు కవిత టీఆర్ఎస్(తెలంగాణ రాష్ట్ర సేన) పేరిట కొత్త పార్టీ ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఆత్మను కోల్పోయిందని.. అందుకే తాను టీఆర్ఎస్ పెట్టి యుద్ధం చేయాల్సి వస్తోందని అన్నారామె. అదే సమయంలో ఆమె నేరుగా ‘తెలంగాణ తొలి సీఎం విఫలం’, ‘సారు మారిపోయారు’.. ‘ఇన్ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్’ అంటూ నేరుగా తండ్రిపైనే విమర్శలు గుప్పించారు.
కవిత పార్టీపై బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే పరోక్షంగా సెటైర్లు వేసింది. కానీ ఆ పార్టీ నేతలెవరూ ఆమె ఆరోపణలపై స్పందించింది లేదు. ఈ తరుణంలో ఇటు పార్టీ శ్రేణులు సైతం ‘‘సారు ఏం మాట్లాడతారో..? కవిత విమర్శలకు స్పందిస్తారా? లేదంటే కేవలం కాంగ్రెస్ సర్కార్పైనే ధ్వజమెత్తుతారా?? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఆ సమావేశం తర్వాత కేసీఆర్ ప్రెస్మీట్ ఉండొచ్చనే సంకేతాలు అందుతున్నాయి.


