ద్విచక్రవాహనం అదుపుతప్పి విద్యార్థిని మృతి
రెంటచింతల: మండలంలోని మిట్టగుడిపాడు–రెంటచింతల గ్రామాల మధ్య జాతీయ రహదారికి సమీపంలో సోమవారం ఉదయం ద్విచక్ర వాహనం అదుపుతప్పి రహదారికి పక్కనే ఉన్న పంటకాల్వలో పడిపోవడంతో బాలిక అక్కడికక్కడే మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. అక్కడ నున్న వ్యవసాయ కూలీలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గురజాల మండలం సమాధానంపేట గ్రామానికి చెందిన భోజావత్ శ్రీనునాయక్, సైదమ్మలకు ముగ్గురు సంతానం. చివరి సంతానం అయిన ఝూన్సీ (13) గురజాల మండలం గంగవరం కస్తూర్భా పాఠశాలలో 8వ తరగతి చదువుతూ మహాశివరాత్రికి ఇంటికి వచ్చింది. ఉదయం తండ్రి శ్రీనునాయక్ తన ద్విచక్ర వాహనంపై కుమార్తె ఝూన్సీని పాఠశాలకు తీసుకువెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పంటకాల్వలో పడిన బాలికపై వాహనం పడటంతో పైకిలేవలేకపోవడం వలన ఊపిరి ఆడక అక్కడికక్కడే మృతి చెందగా శ్రీనునాయక్కు తీవ్ర గాయాలయ్యాయి. నీటిలో పడిన ఇద్దరూ బయటకు రాలేకపోవడంతో కూలీలు బయటకు తీయగా అప్పటికే బాలిక మృతి చెందినట్లు గమనించారు. క్షతగాత్రుడిని వెంటనే స్థానిక ప్రవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం పిడుగురాళ్లకు తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సీహెచ్ నాగార్జున తెలిపారు.


