బెంగళూరులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక భవనంలోని కింది అంతస్తులోని ఒక ఎల్ఈడీ దుకాణం నుండి మంటలు వేగంగా వ్యాపించడంతో, నాలుగు అంతస్తుల భవనం నుండి సుమారు 50 మంది యువతులు అద్భుతంగా ప్రాణాలతో బయటపడ్డారు. ప్రాణాలను కాపాడుకునేందుకు వారంతా పరుగులుతీసిన వైనం సీసీటీవీల్లో రికార్డైంది.
ఈ సంఘటన ఆదివారం రాత్రి నందిని లేఅవుట్లో బ్లూ లీఫ్ అనే ఎల్ఈడీ డిస్ప్లే తయారీ యూనిట్లో తెల్లవారుజామున 12:30 గంటల ప్రాంతంలో జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నారు. మంటలు వేగంగా భవనాన్ని చుట్టుముట్టి, పక్కనే ఉన్న పేయింగ్ గెస్ట్ (పీజీ) వసతి గృహానికి వ్యాపించాయి. అక్కడ 50 మందికి పైగా యువతులు, మహిళలు బస చేస్తున్నారు. మంటలు తీవ్రమవుతుండటంతో, సురక్షితంగా బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో, వారంతా తమ ప్రాణాలను కాపాడుకోవడానికి భవనం పై అంతస్తుల నుండి కిందకు దూకినట్లు సమాచారం. భయభ్రాంతులతో భవనం నుండి దూకి వీధుల్లోకి పరుగెడుతున్న దృశ్యాలు ఘటనా స్థలంలో కనిపించాయి. కొందరికి స్వల్ప గాయాలైనప్పటికీ, నివాసితులందరూ ఎలాంటి ప్రాణనష్టం లేకుండా సురక్షితంగా బయటపడ్డారు.
#Watch: CCTV footage captured the terrifying moment residents fled a massive fire at a Bengaluru PG late on Sunday night. As the blaze tore through the building, several women were seen rushing to safety. #BengaluruFire #WomensPG (Video: PTI) pic.twitter.com/jcGaOfs2AE
— Deccan Chronicle (@DeccanChronicle) April 28, 2026

పీజీ యజమాని వివరాల ప్రకారం ఆ భవనాన్ని తాత్కాలికంగా వసతి కల్పించడానికి ఉపయోగిస్తున్నారు. మంటలు వ్యాపించగానే, అందర్నీ నిద్రలేపి, బయటకు తరలించాం. అదృష్టవశాత్తు, ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదనీ, భగవంతుడే పిల్లల్ని కాపాడాడు అంటూ ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలిపారు.. అగ్నిప్రమాదంలో భవనం మొత్తం తీవ్రంగా దెబ్బతిందని ఆయన తెలిపారు.
ఇదీ చదవండి: వాటర్ మిలన్ క్యాపిటల్ ఏది ? ఈ షాకింగ్ విషయాలు తెలుసా?
ఈ అగ్నిప్రమాదంలో ఎల్ఈడీ దుకాణం లోపల ఉన్న కోట్ల రూపాయల విలువైన వస్తువులు కూడా కాలిపోయాయి. దుకాణం ముందు పార్క్ చేసిన బైక్, నిలిపి ఉంచిన బొలెరో వాహనం కూడా మంటల్లో కాలిపోయాయి. ముఖ్యంగా, సుమారు రూ4 లక్షల విలువైన ఒక పెద్ద ఎల్ఈడీ కటౌట్ పూర్తిగా కాలిపోయింది. అగ్నిమాపక ,అత్యవసర సేవల సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు ధృవీకరించినప్పటికీ, ఆస్తి నష్టం భారీగానే ఉంటుందని అంచనా.
ఇదీ చదవండి: ‘బోష్’ మహిళా ఉద్యోగిని అనుమానాస్పద మరణం
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక పరిశీలనలో షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. స్థానికుల స్పందన పెద్ద విషాదాన్ని నివారించిందనీ అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ కొనసాగుతోంది. జరిగిన నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి: మండే ఎండల్లో ఏసీలు పేలే ప్రమాదం : ఈ జాగ్రత్తలు మస్ట్


