టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ కి కోలీవుడ్ నటుడు విశాల్ కృతజ్ఞతలు తెలిపారు. రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలతో ఎంజీఆర్ని అభిమానించేవారు, అలాగే ఆయనతో పనిచేసిన చాలా మంది బాధపడ్డారు. ఈ విషయంపై సౌత్ ఇండియా ఆర్టిస్ట్ అసోసియేషన్ వివరణ కోరింది.
ఎంజీఆర్పై వ్యాఖ్యల పట్ల చింతిస్తూ రాజేంద్రప్రసాద్ హృదయపూర్వక క్షమాపణ కోరారు. దీనికి నేను రాజేంద్ర ప్రసాద్ గారిని అభినందిస్తున్నానని విశాల్ చెప్పారు. ఇది రాజేంద్రప్రసాద్ నిజమైన గొప్పతనం, వినయానికి నిదర్శనమని పేర్కొన్నారు.
అంతకు ముందు రాజేంద్రప్రసాద్ క్షమాపణలు చెప్పాడు. తమిళ లెజెండరీ నటుడు ఎంజీఆర్పై తాను చేసిన వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నానన్నాడు. అవి ఉద్దేశపూర్వకంగా అన్న మాటలు కాదని, అనుకోకుండా దొర్లాయని విచారం వ్యక్తం చేశాడు. ఈ మేరకు తమిళంలో క్షమాపణలు చెప్తూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఇంకెప్పుడూ అలాంటి వ్యాఖ్యలు చేయనని తెలిపాడు.
ఏం జరిగిందంటే..
కాగా ఇటీవల ఓ ఈవెంట్లో రాజేంద్రప్రసాద్ కాస్త నోరు జారాడు. తెలుగు నటుడు కాంతారావును పొగిడే క్రమంలో ఎంజీఆర్పై చులకన వ్యాఖ్యలు చేశాడు. కాంతారావును చూసి ఎంజీఆర్ ప్యాంటు తడుపుకునేవాడని కామెంట్స్ చేశాడు. ఈ వ్యాఖ్యలపై కోలీవుడ్ సెలబ్రిటీలు విశాల్, నాజర్ మండిపడ్డారు. రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలు ప్రతి తమిళుడి మనసును నొచ్చుకునేలా ఉన్నాయన్నారు. వెంటనే ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో రాజేంద్రప్రసాద్ తన తప్పు తెలుసుకుని క్షమాపణలు కోరాడు.


