‘‘సినిమా అంటే ఒక మ్యాజిక్ ఉండాలి. అలాంటి మ్యాజిక్ ‘డెకాయిట్’ చిత్ర కథలో ఉంది. అందుకే బడ్జెట్ గురించి ఆలోచించకుండా తెలుగు, హిందీ భాషల్లో చిత్రీకరించాం. అన్నీ బడ్జెట్ పరంగా ఆలోచిస్తే కథకు న్యాయం చేయలేం. అలాగే మంచి సినిమాకి ఎప్పుడూ రిస్క్ ఉంటుంది. ‘డెకాయిట్’ చిత్రానికి పతాక సన్నివేశమే అందం’’ అని నిర్మాత సుప్రియ యార్లగడ్డ చెప్పారు. అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సినిమా ‘డెకాయిట్’. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఎస్ఎస్ క్రియేషన్స్పై సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ఈ నెల 10న రిలీజైంది. ఈ సందర్భంగా సోమవారం సుప్రియ విలేకరులతో పంచుకున్న విశేషాలు....
⇒ ‘డెకాయిట్’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన సంతోషాన్ని ఇస్తోంది. హరి పాత్రలో శేష్ అద్భుతంగా నటించారు. మృణాల్ పోషించిన సరస్వతి పాత్రకు ప్రేక్షకులు ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారు. హీరోయిన్ క్యారెక్టర్ బలంగా ఉన్న సినిమా తీయాలనే నా ఆకాంక్ష ఈ సినిమాతో తీరింది. ‘డెకాయిట్’ చిత్రం ఆ సంతృప్తి ఇచ్చింది.
⇒ డిస్ట్రిబ్యూషన్ పరంగా, నిర్మాణపరంగా అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ఎప్పుడూ యాక్టివ్గానే ఉంది. కాకపోతే ఇప్పుడు బయటకు చెప్పుకుంటున్నాం అంతే. నాగార్జునగారి వందో సినిమా గురించి, 2027 సంక్రాంతికి ఆయన హీరోగా రానున్న సినిమా గురించి ప్రస్తుతం నేను ఏం చెప్పలేను.. ఆయనే చెబుతారు. మా ఎస్ఎస్ క్రియేషన్స్లో మళ్లీ సినిమా చేసేందుకు కథలు వినాల్సి ఉంది.
⇒ ఓ సినిమా థియేటర్స్లో రిలీజైన ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ కావాలనే నిబంధనపై నిర్మాతలందరూ నిర్ణయం తీసుకోవాలి. అలాగే నిర్మాతలు–ఎగ్జిబిటర్స్ మధ్య పర్సెంటేజ్ వి«ధానం గురించి ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. రెంటల్ విధానంవైపే నేను మొగ్గు చూపుతాను. కాకపోతే సినిమా టికెట్ ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం థియేటర్స్వారికి లాభం చేకూర్చేలాగా ఆలోచించాలి. ఈ అంశంపై నువ్వా? నేనా? అనే ధోరణితో కాకుండా మనం అనుకుని అందరం కలిసి మాట్లాడుకోవాలి.


