ఒకప్పుడు సినిమా అంటే కేవలం ఒక స్టార్ హీరో, పేరున్న నటీనటులు, నలుగురు వెన్నెముక లాంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉండాల్సిందే. అప్పుడే ఆ సినిమాకు కలెక్షన్లు వచ్చేవి, ప్రేక్షకులు థియేటర్ల వైపు అడుగులు వేసేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది.. ప్రేక్షకుల అభిరుచి మారిపోయింది.ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తోంది ఎవరన్నది కాదు, ఏం చూపిస్తున్నారన్నదే ముఖ్యం. భాషా బేధాలు చెరిగిపోయాయి.. కేవలం కంటెంట్ ఉంటే చాలు, నటీనటులు కొత్తవారైనా సరే ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కథలో దమ్ముంటే, ఆ సినిమాను నెత్తిన పెట్టుకుని గ్లోబల్ రేంజ్కు తీసుకెళ్తున్నారు.
అదే కథలో వైవిధ్యం లేకపోతే.. స్టార్ హీరో సినిమా అయినా సరే.. రెండో రోజే థియేటర్స్ ఖాలీ అయిపోతున్నాయి. అందుకే ఇప్పుడు హీరోల పరిస్థితి దారుణంగా ఉంది. ఫ్యాన్స్తో పాటు సినీ ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే కొత్త ప్రయోగాలు చేయాల్సిందే. హీరోయిన్ల పరిస్థితి కూడా అంతే. వైవిధ్యమైన పాత్రలతో అలరించపోతే.. వారిని ఈజీగా పక్కన పెట్టేస్తున్నారు. ఇప్పటికే అనుష్క, తమన్నా లాంటి హీరోయిన్లను తెలుగు ప్రేక్షకులు మర్చిపోయే పరిస్థితి వచ్చింది. ఇక సమంత, కీర్తి సురేశ్, పూజా హెగ్డే లాంటి తారలు కూడా హిట్లేక అల్లాడిపోతున్నారు.
ఒకప్పుడు కమర్షియల్ హీరోయిన్గా రాణించిన సమంత..ఇటీవల తన పంథాను మార్చేసింది. స్టార్ హీరోల పక్కన నటించడం ఆపేసి.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై ఫోకస్ చేసింది. దీంతో దర్శక నిర్మాతలు కమర్షియల్ సినిమాలకు సమంత పేరుని పరిశీలించడం కూడా మానేశారు. మరోవైపు ఆమె సోలోగా చేసిన శాకుంతలం, యశోద సినిమాలు బక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి. ప్రస్తుతం ఆమె ఆశలన్నీ ‘మా ఇంటి బంగారం’పైనే ఉన్నాయి. ఈ చిత్రాన్ని తన సొంత బ్యానర్లో నిర్మించడంతో అటు నిర్మాతగా, ఇటు నటిగా ఈ మూవీ సమంతకు చాలా ముఖ్యం. ఈ మూవీ హిట్ అయితేనే.. సమంత స్టార్ లిస్ట్లో మరికొంతకాలం కొనసాగుతుంది. లేదంటే ఆమెను కూడా తెలుగు ప్రేక్షకులు మర్చిపోయే ప్రమాదం ఉంది. మే 15న ఈ మూవీ విడుదల కానుంది.
ఇక కీర్తి సురేశ్ పరిస్థితి కూడా సమంతలాగే ఉంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా రాణించిన కీర్తి.. ఇప్పుడు అవకాశాల కోసం ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. ఎల్లమ్మ సినిమాలు అవకాశం వచ్చినట్లే వచ్చి.. చేజారిపోయింది. ఇప్పుడు వెంకటేశ్-అనిల్ రావిపూడి చిత్రంలో చాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే రౌడీ జనార్థన చిత్రంలోనూ విజయ్కి జోడీగా నటిస్తోంది. ఈ రెండు సినిమాలు హిట్ అయితేనే కీర్తి సురేశ్కు మరిన్ని అవకాశాలు వచ్చే చాన్స్ ఉంది.
ఇక పూజా హెగ్డె.. ‘అల..వైకుంఠపురములో’ మూవీతో స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఒకప్పుడు తెలుగు,తమిళ, హిందీ సినిమాలతో బిజీ అయిపోయింది. కానీ ఇప్పుడు ఆమెకు ఎక్కడ అవకాశాలు రావట్లేదు. తెలుగులో అయితే పూజా హెగ్డే పేరునే మర్చిపోతున్నారు. నాని – సుజిత్ కాంబోలో వస్తున్న ‘బ్లడీ రోమియో’ లో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా హిట్ అయితేనే పూజా కూడా కొన్నాళ్ల పాటు స్టార్ హీరోయిన్ లిస్ట్లో కొనసాగుతుంది. లేదంటే పూజా పేరుని కూడా టాలీవుడ్ మర్చిపోతుంది. అందుకే సమంత, కీర్తి, పూజా హెగ్డేలకు అర్జెంట్గా హిట్ అవసరం. మరి ఈ కొత్త చిత్రాలన్ని విజయం సాధించి.. ఈ తారలను మరికొంతకాలం స్టార్ హీరోయిన్లుగా కొనసాగిస్తాయో లేదో చూడాలి.


