ఆన్‌ మిషన్‌ జోరు మీదున్న యానిమేషన్‌ మూవీస్‌ | Growing Fascination For Anime | Sakshi
Sakshi News home page

ఆన్‌ మిషన్‌ జోరు మీదున్న యానిమేషన్‌ మూవీస్‌

Feb 18 2026 12:31 AM | Updated on Feb 18 2026 12:31 AM

Growing Fascination For Anime

అమరేంద్ర బాహుబలి.... భల్లాలదేవ ఢీ అంటే ఢీ అంటూ ఆయుధాలతో, ఒంటి చేత్తో ఒకరిపై మరొకరు ఎలా దాడి చేసుకున్నారో ‘బాహుబలి’లో చూశాం...
⇒  కొమురం భీమ్‌... అల్లూరి సీతారామరాజు బ్రిటిష్‌ వారిపై ఏ స్థాయి పోరాటం చేశారో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో చూశాం.

⇒ ఇప్పుడు ఈ సినిమాల్లోని క్యారెక్టర్లు ‘యానిమేషన్‌’ రూపంలో కనిపిస్తే... అదో థ్రిల్‌. 
⇒ అంతేనా... హిరణ్యకశిపుడిని నరసింహావతారంలో ఆ విష్ణువు సంహరించిన ఘటనను ‘మహావతార్‌ నరసింహా’లో చూశాం. అయితే యానిమేషన్‌ రూపంలోనే ఈ సినిమాని చూశాం. ఈ సిరీస్‌లో ఇంకా ఆరు సినిమాలు రానున్నాయి.

⇒ ఇవే కాదు... ఇంకా మరికొన్ని యానిమేషన్‌ చిత్రాలు రెడీ అవుతున్నాయి. ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు యానిమేషన్‌ చిత్రాల నిర్మాణం ఎక్కువైంది. దానికి కారణం ఆ చిత్రాలకు దక్కుతున్న ప్రేక్షకాదరణ... వస్తున్న వసూళ్లు.
⇒ ఇక ‘ఆన్‌ మిషన్‌’ అంటూ జోరుగా నిర్మాణంలో ఉన్న ‘యానిమేషన్‌ మూవీస్‌’ గురించి తెలుసుకుందాం.

ఇటు బాహుబలి... అటు ఆర్‌ఆర్‌ఆర్‌ 
ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలోపాన్‌ ఇండియా మార్కెట్‌ ట్రెండ్‌ను తెరపైకి తెచ్చిన ఈ తరం దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి. ఇప్పుడు మహేశ్‌బాబుతో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ‘వారణాసి’ సినిమాను తెరకెక్కిస్తూ, అదే స్థాయిలో రిలీజ్‌నుప్లాన్‌ చేస్తూ,పాన్‌–వరల్డ్‌ ట్రెండ్‌ను టాలీవుడ్‌లో స్టార్ట్‌ చేశారు. అలాగే రాజమౌళి చూపు యానిమేషన్‌ చిత్రాలపై పడినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చాలా సినిమాల్లో భారీ స్థాయి వీఎఫ్‌ఎక్స్‌ విజువల్‌ వండర్స్‌ను ఆడియన్స్‌ తెరపై చూశారు. ముఖ్యంగా ‘ఈగ’ సినిమాను రాజమౌళి సూపర్బ్‌ టెక్నికల్‌ స్టాండర్డ్స్‌తో తెరకెక్కించారు. ఆయన డైరెక్షన్‌లో వచ్చిన ‘బాహుబలి’ (‘బాహుబలి: ది బిగినింగ్‌’, ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’), ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాల కొనసాగింపు కథలు యానిమేషన్‌ రూపంలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా, రానా, అనుష్క,  రమ్యకృష్ణ, నాజర్, తమన్నా, సత్యరాజ్‌ ప్రధానపాత్రల్లో నటించిన బ్లాక్‌బస్టర్‌ మూవీ ‘బాహుబలి’. ఈ సినిమా తొలి భాగం ‘బాహుబలి: ది బిగినింగ్‌’ విడుదలై పదేళ్లు పూర్తయిన సందర్భంగా ‘బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: కన్‌క్లూజన్‌’ చిత్రాలను కలిపి  ‘బాహుబలి: ది ఎపిక్‌’గా గత ఏడాది 31 అక్టోబరు 2025న విడుదల చేశారు. ఆ సమయంలో ‘బాహుబలి’ ఫ్రాంచైజీ నుంచి మూడో భాగానికి సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ రావొచ్చనే ఊహాగానాలు పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చాయి. కానీ ‘బాహుబలి’ కథకు కొనసాగింపుగా ‘బాహుబలి: ది ఎటర్నల్‌ వార్‌’ అనే యానిమేషన్‌ సినిమా త్రీడీ ఫార్మాట్‌లో రానుందని, రాజమౌళి అధికారికంగా వెల్లడించారు.

‘బాహుబలి: ది ఎటర్నల్‌ వార్‌’ సినిమా టీజర్‌ను కూడా రిలీజ్‌ చేసి, ఈ సినిమాను 2027లో రిలీజ్‌ చేయనున్నట్లుగా రాజమౌళి తెలిపారు. మరో విశేషం ఏంటంటే.. 2027లో రిలీజ్‌ అవుతున్నది ‘ది బాహుబలి: ది ఎటర్నల్‌ వార్‌’ తొలి భాగం మాత్రమే. అంటే... ‘బాహుబలి’ ఫ్రాంచైజీ నుంచి మరికొన్ని యానిమేషన్‌ చిత్రాలొస్తాయని ఊహించవచ్చు. దేవ, రాక్షసుల యుద్ధంలో బాహుబలి ప్రమేయం ఉంటే ఏం జరుగుతుంది? అనేపాయింట్‌ ఆఫ్‌ వ్యూలో ‘బాహుబలి: ది ఎటర్నల్‌ వార్‌’ సినిమా కథనం సాగుతుందని తెలుస్తోంది. ఈ త్రీడీ యానిమేషన్‌ సినిమాను దాదాపు రూ. 120 కోట్లతో తెరకెక్కిస్తున్నారట మేకర్స్‌.

ఆర్కా మీడియా వర్క్స్, ముంబైకి చెందిన యానిమేషన్‌ లీడ్‌ స్టూడియో 88 పిక్చర్స్‌ ఈ సినిమా నిర్మాణంలో అసోసియేట్‌ అయ్యాయి. ఇషాన్‌ శుక్లా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, రాజమౌళి ఈ సినిమాకు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ‘‘బాహుబలి: ది ఎటర్నల్‌ వార్‌’ సినిమాకు నా పర్యవేక్షణ కూడా ఉంటుంది. ఇప్పటికే విడుదలైన ‘బాహుబలి’ సినిమాల్లోని క్యారెక్టర్స్‌తోపాటు మరికొన్ని కొత్తపాత్రలను ఈ సినిమాలో చూస్తారు’’ అని ఓ సందర్భంలో రాజమౌళి పేర్కొన్నారు.

ఆర్‌ఆర్‌ఆర్‌ యూనివర్స్‌ 
ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో 2022 మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా ఎంతటి బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని సాధించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలోని ‘నాటు నాటు’పాట ప్రపంచవ్యాప్తంగా సూపర్‌ హిట్‌ కావడం, ఈపాట రచయిత చంద్రబోస్, సంగీత దర్శకుడు ఎమ్‌ఎమ్‌ కీరవాణిలకు ఆస్కార్‌ అవార్డులు రావడం కూడా తెలిసిందే. అయితే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా విడుదలైన తర్వాత ఒకట్రెండు సందర్భాల్లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌ 2’ ఉండే అవకాశం ఉందని, ఈ చిత్రం కథారచయిత విజయేంద్ర ప్రసాద్‌ పేర్కొన్నారు.

ఇప్పుడు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కథకు కొనసాగింపుగా సినిమా రానుంది. కానీ లైవ్‌ యాక్షన్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ కాదు... యానిమేషన్‌ ఫిల్మ్‌. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాకు కొనసాగింపుగా ‘ఆర్‌ఆర్‌ ఆర్‌’ యూనివర్స్‌లో ఓ యానిమేషన్‌ సినిమా చేసే ఆలోచన ఉందని, ఈ అంశంపై జపాన్‌ స్టూడియోలు వర్క్‌ చేస్తున్నాయని ఇటీవల ఓ సందర్భంలో రాజమౌళి పేర్కొన్నారు. ఇలా... ఒకవైపు లైవ్‌ యాక్షన్‌ ఫీచర్‌ ఫిల్మ్స్‌ చేస్తూనే, భవిష్యత్‌లో యానిమేషన్‌ సినిమాల హవా ఉంటుందని ఇప్పట్నుంచే రాజమౌళి ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లుగా స్పష్టంగా తెలుస్తోంది

ఏఐతో ‘కొచ్చడైయాన్‌’ 
రజనీకాంత్‌ హీరోగా, ఆయన కుమార్తె సౌందర్య రజనీకాంత్‌ దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘కొచ్చడైయాన్‌’ (2014). ఈ తమిళ పీరియాడికల్‌ యానిమేషన్‌ మూవీని సునీల్, సునంద మురళీ మనోహర్, ప్రశీదా చౌదరి నిర్మించారు. ఈరోస్‌ ఇంటర్‌నేషనల్‌ సంస్థ ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్‌ చేసింది. కాగా ఈ సినిమా త్వరలోనే రీ రిలీజ్‌ కానున్నట్లు తెలుస్తోంది. అంటే...‘కొచ్చడైయాన్‌’ సినిమాను ఏఐ (కృత్రిమ మేధ)తో కొత్త వెర్షన్‌ రెడీ చేశారు.

ఈ రీ మాస్టర్డ్‌ ‘కొచ్చడైయాన్‌’ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో టీజర్‌ను మంగళవారం రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ‘‘పదేళ్ల క్రితం మోషన్‌ క్యాప్చర్‌ ఫిల్మ్‌గా చేశాం. ఈ సినిమా నన్ను చాలెంజ్‌ చేసింది. నన్ను చేంజ్‌ చేసింది. ‘కొచ్చడైయాన్‌’ రీ మాస్టర్డ్‌ టీజర్‌ని రిలీజ్‌ చేయడం భావోద్వేగానికి గురి చేస్తోంది’’ అని సౌందర్య రజనీకాంత్‌ పేర్కొన్నారు. దీపికా పదుకోన్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో శోభన్, ఆర్‌. శరత్‌కుమార్, ఆది పినిశెట్టి ఇతర ప్రధానపాత్రల్లో నటించారు.  

మహావతార్‌ యూనివర్స్‌ 
గత ఏడాది జూలైలో విడుదలైన యానిమేషన్‌ సినిమా ‘మహావతార్‌ నరసింహా’ బాక్సాఫీస్‌ దుమ్ము దులిపేసింది. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ యానిమేషన్‌ సినిమాను దాదాపు రూ. 40 కోట్ల బడ్జెట్‌తో మేకర్స్‌ నిర్మించగా, ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 350 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, ట్రేడ్‌ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. అశ్విన్‌కుమార్‌ డైరెక్షన్‌లో క్లిమ్‌ ప్రోడక్షన్స్, హోంబలే ఫిల్మ్స్‌ సంస్థలు ‘మహావతార్‌ నరసింహా’ను నిర్మించాయి.

అయితే ఇక్కడ ప్రస్తావించుకోవాల్సిన విషయం ఏంటంటే...‘మహావతార్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌’ నుంచి ‘మహావతార్‌ పరశురామ్‌’ (2027), ‘మహావతార్‌ రఘునందన్‌’ (2029) – (రామావతారం), ‘మహావతార్‌ ద్వారకాధీష్‌’ (2031) – (కృష్ణుడు), ‘మహావతార్‌ గోకులానంద’ (2033) – (కృష్ణుడి బాల్యం/గోకులం), ‘మహావతార్‌: కల్కిపార్ట్‌ 1’ (2035), ‘మహావతార్‌: కల్కిపార్ట్‌ 2’ (2037) చిత్రాలు రానున్నాయి.

‘మహావతార్‌ నరసింహా’ తర్వాత ‘మహావతార్‌ పరశురామ్‌’ సినిమాను థియేటర్స్‌లో రిలీజ్‌ చేస్తామని, ప్రతి రెండేళ్లకొకసారి, మహావతార్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌ నుంచి ఓ యానిమేషన్‌ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తామని, దర్శకుడు అశ్విన్‌ ఓ సందర్భంలో పేర్కొన్నారు. భవిష్యత్‌లో యానిమేషన్‌ చిత్రాలకు ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో గొప్ప ఆదరణ ఉంటుందని కూడా అశ్విన్‌ పేర్కొన్నారు.

వాయుపుత్ర 
భారతీయ ఇతిహాసాలు ‘రామాయణం, మహాభారతం’ ఆధారంగా చాలా సినిమాలు వచ్చాయి... మరికొన్ని నిర్మాణంలో ఉన్నాయి. కాగా పర్వతాలనే కదిలించిన మహా బలశాలి, అంజనీపుత్రుడు హనుమంతుని జీవితం ఆధారంగా ‘వాయుపుత్ర’ అనే యానిమేషన్‌ సినిమా తెరకెక్కుతోంది. ‘కార్తికేయ, కార్తికేయ 2’ చిత్రాలను తెరకెక్కించిన చందు మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ త్రీడీ యానిమేషన్‌ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. గత ఏడాది సెప్టెంబరులో ‘వాయుపుత్ర’ సినిమాను అధికారికంగా ప్రకటించారు. 2డీ, 3డీ ఫార్మాట్స్‌లో ‘వాయుపుత్ర’ సినిమాను ఈ ఏడాది దసరాకు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్‌ చేయనున్నట్లుగా మేకర్స్‌ తెలిపారు.  

కీకీ అండ్‌ కోకో 
యానిమేషన్‌ చిత్రాల్లోనే కిడ్స్‌ నేపథ్యంలో వచ్చే సినిమాలకు మంచి క్రేజ్‌ ఉంటుంది. హాలీవుడ్‌ నుంచి ఇండియన్‌ వ్యూయర్స్‌ ముందుకు వచ్చిన పలు బాలల యానిమేషన్‌ చిత్రాలకు విశేషమైన ఆదరణ దక్కింది. అయితే ఈసారి ఈ జానర్‌లో ఇండియన్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ నుంచి ‘కీకీ అండ్‌ కోకో’ సినిమా రానుంది. బాలనటి శ్రీనిక ప్రధానపాత్రధారిగా పి. నారాయణన్‌ దర్శకత్వంలో ధరణి నిర్మించిన ఈ కిడ్స్‌ యానిమేషన్‌ సినిమా త్వరలోనే రిలీజ్‌ కానుంది.  

పినాకిన్‌ 
లార్డ్‌ శివ నేపథ్యంలో ‘పినాకిన్‌’ అనే యానిమేషన్‌ చిత్రం రూపొందుతోంది. కమల్‌భారతి ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై హర్‌‡్ష పండిట్, వామన్‌ రాణే ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ‘పినాకిన్‌’ సినిమాను అధికారికంగా ప్రకటించారు మేకర్స్‌. అంతేకాదు... ఈ చిత్రాన్ని ఈ ఏడాదే తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో రిలీజ్‌ చేయనున్నట్లుగా తెలిపారు. అలాగే మహాశివరాత్రి సందర్భంగానే ‘శివ్‌ సతీ’ అనే మరో యానిమేషన్‌ సినిమాను ప్రకటించారు. వివేక్‌ అంచాలియా ఈ సినిమాకు దర్శకడు.  

ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌ 
ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌ నుంచి వచ్చిన ‘హను–మాన్‌’ సినిమా ఎంతపెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఇందులో తేజ సజ్జా హీరోగా నటించారు. ఈ యూనివర్స్‌ నుంచే ఇంకా ‘మహాకాళి, అధీర, జై హనుమాన్‌’ వంటి సినిమాలు రానున్నాయి. హనుమాన్‌ మూవీకి 71వ జాతీయ అవార్డుల్లో వీఎఫ్‌ఎక్స్‌–యానిమేషన్‌ విభాగంలో అవార్డులు వచ్చిన విషయం గుర్తుంటే ఉంటుంది (యానిమేషన్‌ విభాగంలో జెట్టి వెంకట్‌కుమార్‌ అవార్డు అందుకున్నారు). అయితే ఈ యూనివర్స్‌ నుంచే రెండు యానిమేషన్‌ చిత్రాలను రూపొందించాలనే ఆలోచనలో ఉన్నారట ప్రశాంత్‌ వర్మ.

గత ఏడాది గోవా వేదికగా జరిగిన 56వ ఇఫీ వేడుకల్లోపాల్గొన్న ఆయన యానిమేషన్‌ చిత్రాలను రూపొందించే ఆలోచనలో ఉన్నట్లుగా చెప్పినట్లు వార్తలు ఉన్నాయి. ఇక రిషబ్‌ శెట్టి హీరోగా ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలోని ‘జై హనుమాన్‌’ సినిమా ఈ నెల 22న హంపిలో ప్రారంభం కానుందని, ఈ సినిమాలో రానా ఓ కీలకపాత్రలో నటించనున్నారని తెలిసింది. అలాగే ‘జై హనుమాన్‌’ చిత్రంలో తేజ సజ్జా కూడా నటిస్తారని సమాచారం. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించనున్నారు.

భలే భలే మగాడివోయ్‌ సీక్వెల్‌ 
నాని, లావణ్యా త్రిపాఠి హీరో హీరోయిన్లుగా మారుతి డైరెక్షన్‌లో రూపొందిన ‘భలే భలే మగాడివోయ్‌’ సినిమా 2015లో విడుదలై, సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్‌ రావొచ్చనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దీంతో ప్రభాస్‌ ‘ది రాజాసాబ్‌’ సినిమా ప్రమోషన్స్‌లో మారుతి ఈ అంశంపై స్పందించారు. ‘భలే భలే మగాడివోయ్‌’ సినిమాకు సీక్వెల్‌ కథను యానిమేషన్‌ రూపంలో తీసుకు వచ్చే ఆలోచన ఉందని మారుతి చెప్పారు. ఇండస్ట్రీకి రాకముందు మారుతికి యానిమేటర్‌గా వర్క్‌ చేసిన అనుభవం ఉంది. అలా యానిమేషన్‌ రంగంలో ఆల్రెడీ ఆయనకు ప్రవేశం ఉంది. ఒకసారి తెలుగు ఇండస్ట్రీలో యానిమేషన్‌ సినిమాల హవా ఊపందుకుంటే, ఆయన డైరెక్షన్‌లో ఓ యూనిమేషన్‌ మూవీ రావొచ్చని ఊహించవచ్చు.

ఈ కోవలో మరికొన్ని యానిమేషన్‌ చిత్రాలు రూపొందుతున్నాయి. ముఖ్యంగా మన భారత పురాణ కథల ఆధారంగా ఎక్కువగా యానిమేషన్‌ చిత్రాలు రూపొందడం విశేషం. ఆ రకంగా వినోదానికి వినోదం... విజ్ఞానానికి విజ్ఞానం అందుతుంది. నేటి తరం పురాణ కథలు తెలుసుకోవడానికి ఈ యానిమేషన్‌ చిత్రాలు ఉపయోగపడతాయని చెప్పోచ్చు.  

యానిమేషన్‌ సినిమా వసూళ్లు రూ. 19 వేల కోట్లు 
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్ళు సాధించిన టాప్‌ టెన్‌ చిత్రాల జాబితాలో ఓ యానిమేషన్‌ సినిమా ఉంది. అదే ‘నే ఝా 2’ (2019లో వచ్చిన ‘నే ఝా’ సినిమాకు ఇది సీక్వెల్‌). చైనీస్‌ మైథాలజీతో కూడిన ఈ ‘నే ఝా 2’ చిత్రం గత ఏడాది జనవరి 29న రిలీజైంది. యు యంగ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. చైనాలో బాక్సాఫీస్‌ వద్ద ఈ సినిమా సరికొత్త రికార్డులను సృష్టించింది. 2025 చివర్లో ఇతర విదేశీ భాషల్లో కూడా ఈ సినిమా అనువాదమై, సూపర్‌హిట్‌గా నిలిచింది. 

దాదాపు రూ. 700 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చైనీస్‌ యానిమేషన్‌ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2.2 బిలియన్‌ డాలర్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టి ట్రెడ్‌ వర్గీయులను ఆశ్చర్యపరిచింది. బాక్సాఫీసు వద్ద కనక వర్షం కురిపించింది. మాస్టర్‌ షెన్‌కు వ్యతిరేకంగా నే ఝా ఎలా పోరాటం చేశాడు? ఈ పోరాటంలో నే ఝా స్నేహితుడు అవో బింగ్‌ సహకారం ఏంటి? అనే అంశాల నేపథ్యంలో ‘నే ఝా 2’ కథ సాగుతుంది. ఈ సినిమా ఈ నెల 20 నుంచి జియో హాట్‌స్టార్‌ ఓటీటీలో ఇంగ్లిష్, హిందీ, మాండరీన్‌ (చైనా భాష) భాషల్లో యాపిల్‌ టీవీప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. 

– ముసిమి శివాంజనేయులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement