గుర్రువుల పోరు
కపిలేశ్వరపురం: భావిభారత పౌరులను తీర్చిదిద్దే ఉపాధ్యాయుడంటే సమాజంలో ఎనలేని గౌరవం ఉంటుంది. అయితే చంద్రబాబు ప్రభుత్వం వారికి కనీస విలువ ఇవ్వడం లేదు. ఎన్నికల సమయంలో వారికి కూటమి నేతలు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు. ఎన్నిసార్లు గుర్తు చేసినా పట్టించుకోవడం లేదు. చేసేది లేక ప్రజాస్వామ్య పద్ధతిలో ఉపాధ్యాయులు మంగళవారం రణభేరి 2.0 పేరుతో ఆందోళనకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో గురువుల గోడును వివరిస్తూ కథనం..
ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయులిలా...
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 4,570 ప్రభుత్వ పాఠశాలలకు గానూ, 18,316 మంది ఉపాధ్యాయులు విద్యా బోధన చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో 962 ప్రభుత్వ పాఠశాలల్లో 5,814 మంది, కాకినాడ జిల్లాలో 1,246 పాఠశాలల్లో 6,493 మంది, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని 1,562 పాఠశాలల్లో 4,109 మంది, పోలవరం జిల్లాలోని 12 మండలాల పరిధిలో సుమారు 800 ప్రభుత్వ పాఠశాలలుండగా వాటిలో 1,900 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు.
నేటి విజయవాడ ధర్నాకు ఉపాధ్యాయులు
యూటీఎఫ్ పలు ప్రధాన డిమాండ్లతో మంగళవారం ఉపాధ్యాయ రణభేరి పేరుతో చలో విజయవాడ ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడలోని బీఆర్టీఎస్ రోడ్డులో ధర్నా చేయనున్నారు. ఆ మేరకు ఈ నెల 13న విజయవాడలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు తదితరులు రణభేరి కార్యక్రమం పోస్టర్ను విడుదల చేశారు. అదే రోజు పోలవరం జిల్లా వీఆర్పురం మండలం రేఖపల్లిలో ఆందోళన సన్నాహక సమావేశం నిర్వహించారు. తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, పోలవరం జిల్లాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. విజయవాడకు తరలివెళ్లే విషయమై సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ బొర్రా గోపీ మూర్తి దిశా నిర్దేశం చేశారు.
గురువులకు గుదిబండలా మారిన
చంద్రబాబు ప్రభుత్వం..
సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఉద్యోగ, ఉపాధ్యాయులకు పలు హామీలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన 20 నెలలు అయినా ఆ హామీలను విస్మరిస్తున్నారు. యూటీఎఫ్, ఎస్టీయూ తదితర సంఘాలు ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబుకు అనేకమార్లు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ స్పందించడం లేదు. పైగా బోధనేతర పనులతో ఉపాధ్యాయులపై పని ఒత్తిడి పెంచారు. హామీల అమలుకు అనేకసార్లు విజ్ఞప్తులు చేసిన ఉపాధ్యాయులు చట్ట పరిధిలో శాంతియుత మార్గాన నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అయినా ప్రభుత్వం ఖాతరు చేయకపోవడంతో ఈ నెల 13న ఎస్టీయూ కాకినాడ, రాజమహేంద్రవరంలలోని కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేసింది. 25న చలో విజయవాడకు పిలుపునిచ్చింది. యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబుకు ఉపాధ్యాయులు లక్ష ఉత్తరాలు రాశారు. ఈ నెల 5న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నా నిర్వహించగా ఉమ్మడి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు తరలివెళ్లారు.
ఉపాధ్యాయ ‘రణభేరి 2.0 డిమాండ్లు ఇవీ..
12వ పీఆర్సీ కమిషన్ వెంటనే
నియమించాలి.
29 శాతం మధ్యంతర భృతి
(ఐఆర్) ప్రకటించాలి.
పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను
వెంటనే విడుదల చేయాలి.
ఉద్యోగుల, పెన్షనర్ల బకాయి చెల్లింపులకు
రోడ్ మ్యాప్ ప్రకటించాలి.
ఉద్యోగులు, ఉపాధ్యాయులు రిటైరైన
రోజే ఆర్థిక చెల్లింపులు పూర్తిచేయాలి.
సీపీఎస్ రద్దు చేయాలి
హెల్త్కార్డుపై మెడికల్ బిల్ చెల్లింపు
సమస్య పరిష్కరించాలి. కొత్త హెల్త్ కార్డులు మంజూరు చేయాలి.
ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేయాలి. ఆ మేరకు కోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలి.
సెలవుల్లో తరగతుల నిర్వహణ
భారం తొలగించాలి.
2004 ముందు నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాల్లో చేరిన 2003 డీఎస్సీ ఉపాధ్యాయులు, పోలీసులు, ఇతర ఉద్యోగులకు, కేంద్రం ఇచ్చిన మెమో నంబర్ 57 ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి.
టీచర్ల గోడు పట్టని చంద్రబాబు ప్రభుత్వం
హామీలను తుంగలోకి తొక్కిన వైనం
ఎన్నిసార్లు విన్నవించినా దక్కని ఫలితం
నేడు యూటీఎఫ్ రణభేరి 2.0
విజయవాడకు తరలివెళ్తున్న
ఉపాధ్యాయులు
గుర్రువుల పోరు


