గరిష్ట బ్యాలెన్స్ రూ.2 లక్షలు
ఆర్బీఐ కొత్త ప్రతిపాదనలు
ముంబై: ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ (పీపీఐ)ను మరింత బలోపేతం చేసేందుకు, లావాదేవీల భద్రతను పెంచేందుకు ఆర్బీఐ కీలక ప్రతిపాదనలు చేసింది. వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారం, నగదు తిరిగి చెల్లింపుల (రిఫండ్) ప్రక్రియల్లో స్పష్టత తెస్తూ కొత్త ముసాయిదా నిబంధనలను విడుదల చేసింది. ముందుగానే నగదును జమ చేసి, ఆ తర్వాత వివిధ అవసరాలకు చెల్లింపులు చేసే సాధనాలను పీపీఐలుగా చెబుతారు.
→ డెబిట్ కార్డులకు అనుమతి ఉన్న బ్యాంక్లు పీపీఐలను జారీ చేయొచ్చు. దీనికంటే ముందే డిపార్ట్మెంట్ ఆఫ్ పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ (డీపీఎస్ఎస్)కు ముందస్తు సమాచారం ఇవ్వాలి.
→ ఆర్బీఐ నుంచి అనుమతితో నాన్ బ్యాంకింగ్ సంస్థలు సైతం పీపీఐలు జారీ చేయొచ్చు.
→ పీపీఐలలో ఏ సమయంలో అయినా గరిష్టంగా రూ. 2 లక్షల వరకే బ్యాలన్స్ ఉండాలి.
→ ఒక నెలలో గరిష్టంగా రూ.10,000 లోడ్ చేసుకోవచ్చు.
→ బహుమతి కార్డుల విలువ రూ. 10,000, ప్రయాణ కార్డుల విలువ రూ. 3,000 మించి ఉండకూడదు.
→ ప్రవాస భారతీయులు భారత్లో పర్యటించే సమయంలో వారి పాస్పోర్ట్, వీసా ధ్రువీకరణ తర్వాత పీపీఐ వాలెట్లు పొందొచ్చు. నెలకు గరిష్టంగా రూ. 5 లక్షల వరకు చెల్లింపులు చేసుకోవచ్చు.
→ కేవైసీ పూర్తి చేసిన వారికి కార్డు నెట్వర్క్ లేదా యూపీఐ నెట్వర్క్ ద్వారా పీపీఐ లావాదేవీలు నిర్వహించుకునే సౌకర్యం కలి్పంచాలి.
→ ఫెయిల్ అయిన లేదా రద్దయిన లావాదేవీలకు సంబంధించిన నగదును వెంటనే సంబంధిత పీపీఐ ఖాతాలో జమ చేయాలి.
→ ఈ ప్రతిపాదనలపై అభిప్రాయాలను 2026 మే 22 లోపు తెలియజేయాలని ఆర్బీఐ కోరింది.


