అంతర్జాతీయంగా అనిశ్చితులున్నప్పటికీ భారత ఆఫీస్ మార్కెట్ డిమాండ్కు కొత్త రికార్డులకు చేరుతోంది. ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో దేశవ్యాప్తంగా టాప్–7 నగరాల్లో 21.5 మిలియన్ చదరపు అడుగుల స్థూల(ఎస్ఎఫ్టీ) ఆఫీస్ వసతుల (ఆఫీస్ లీజ్/కార్యాలయ స్థలాలు) లీజింగ్ లావాదేవీలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో లీజింగ్ 19.5 మిలియన్ ఎస్ఎఫ్టీతో పోల్చి చూస్తే 10 శాతం పెరిగింది.
ఇక నికర ఆఫీస్ లీజింగ్ (రెన్యువల్స్ కాకుండా) 7 శాతం పెరిగి 13.7 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరింది. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్, పుణె, ముంబై, చెన్నై, కోల్కతా నగరాల డేటా ఆధారంగా ఈ వివరాలను రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా విడుదల చేసింది. ప్రధానంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీలు) ఏర్పాటుకు విదేశీ సంస్థల నుంచి బలమైన డిమాండ్ ఉన్నట్టు తెలిపింది.
‘‘భారత్ ఆఫీస్ మార్కెట్ మొదటి త్రైమాసికంలో ఇప్పటి వరకు లేనంతటి బలమైన పనితీరును పనిచేసింది. అంతర్జాతీయ అనిశ్చితుల మధ్య ఇది చెప్పుకోతగ్గ పనితీరే. అంతర్జాతీయ సంస్థలు భారతదేశాన్ని వినియోగించుకునే విధానంలో వచి్చన మౌలిక మార్పు ఈ వృద్ధికి చోదక శక్తిగా నిలుస్తోంది’’అని జేఎల్ఎల్ ఇండియా ఆఫీస్ లీజింగ్ హెడ్ రాహుల్ అరోరా తెలిపారు.
జీసీసీల జోరు..
విదేశీ సంస్థలు ఏర్పాటు చేసిన జీసీసీల లీజింగ్ 43 శాతం పెరిగి 9.8 మిలియన్ ఎస్ఎఫ్టీగా నమోదైంది. మొత్తం లీజింగ్లో 45.5 శాతంగా ఉంది. ‘‘ఇవేవీ వ్యూహాత్మక బ్యాక్ ఆఫీస్లు కానేకావు. ఏఐ అభివృద్ధి, డిజిటల్ ఇంజనీరింగ్, ఉత్పత్తుల అభివృద్ధి కోసం ఏర్పాటు చేస్తున్న ఆవిష్కరణల కేంద్రాలు’’అని జేఎల్ఎల్ ఇండియా నివేదిక తెలిపింది. టాప్–7 నగరాల్లో బెంగళూరు ఆఫీస్ మార్కెట్ మెరుగైన పనితీరు చూపించింది.
మార్చి త్రైమాసికంలో స్థూల లీజింగ్ 25 శాతం పెరిగి 5.3 మిలియన్ ఎస్ఎఫ్టీగా ఉంది. మార్చి త్రైమాసికంలో స్థూల లీజింగ్లో 9.2 మిలియన్ ఎస్ఎఫ్టీ దేశీ సంస్థలు తీసుకున్నవే. క్రితం ఏడాది మార్చి క్వార్టర్తో పోల్చితే 5 శాతం పెరిగింది. దేశీ సంస్థలు తీసుకున్న లీజింగ్లోనూ 57.8 శాతం ఫ్లెక్స్ ఆపరేటర్ల రూపంలోనే ఉన్నట్టు జేఎల్ఎల్ ఇండియా నివేదిక తెలిపింది.


