బ్యాంకులు మన రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. ఎంత డిజిటైలేజన్, ఆన్లైన్ సేవలు పెరిగిప్పటికీ నిత్యం ఏదో పని నిమిత్తం బ్యాంకులను సందర్శిస్తున్నవారు చాలా మందే ఉంటారు. అలా బ్యాంకులకు వెళ్లే వారికి ముఖ్య గమనిక. మే నెల ప్రారంభంలోనే బ్యాంకులకు సెలవులు రానున్నాయి.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) విడుదల చేసిన సెలవుల జాబితా ప్రకారం, ఈ వారం మే 1న దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు. మే 1వ తేదీ (శుక్రవారం) నాడు మహారాష్ట్ర దినోత్సవం, మే డే (కార్మిక దినోత్సవం) సందర్భంగా దేశంలోని మెజారిటీ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ప్రకటించారు. వీటితో పాటు కొన్ని ప్రాంతాల్లో బుద్ధ పూర్ణిమ, పండిట్ రఘునాథ్ ముర్ము జయంతి వేడుకలు కూడా అదే రోజు ఉండటంతో సెలవు వర్తించనుంది.
మే నెలలో రెండో, నాలుగో శనివారాలు, ఆదివారాలతో కలిపి మొత్తం 12 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ వారంలో సెలవుల వివరాలు ఇలా ఉన్నాయి..
మే 1 శుక్రవారం - మే డే / మహారాష్ట్ర దినోత్సవం (మెజారిటీ రాష్ట్రాల్లో)
మే 3 ఆదివారం - వారాంతపు సెలవు
సెలవు లేని రాష్ట్రాలు
గుజరాత్, ఒడిశా, చండీగఢ్, సిక్కిం, రాజస్థాన్, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల్లో మాత్రం మే 1న బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయి.
భారతదేశంలో మే డే అనేది జాతీయ సెలవు దినం కాదు. బ్యాంకుల సెలవులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు 'నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్' కింద ప్రకటిస్తాయి. గుజరాత్, రాజస్థాన్, ఒడిశా వంటి రాష్ట్రాలు మే డేని అధికారిక బ్యాంకు సెలవుగా గుర్తించలేదు.
కస్టమర్లకు టెన్షన్ అక్కర్లేదు
బ్యాంకు భౌతిక శాఖలు మూతపడినప్పటికీ, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ (UPI) సేవలు 24/7 అందుబాటులో ఉంటాయి.
అలాగే నగదు విత్ డ్రా కోసం ఏటీఎంలు యథావిధిగా పనిచేస్తాయి. అయితే చెక్కుల క్లియరెన్స్ లేదా ఇతర ముఖ్యమైన లావాదేవీలు ఉన్నవారు ఈ సెలవులను దృష్టిలో ఉంచుకుని తమ పనులను ముందుగానే పూర్తి చేసుకోవడం ఉత్తమం.


