ఒరిస్సా యువకుడు అనుమానాస్పద మృతి
మదనపల్లె టౌన్ : ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన ఆదివారం నిమ్మనపల్లె మండలం, బోయకొండ అటవీ ప్రాంతంలోని ఓ కోళ్ల ఫారం వద్ద చోటుచేసుకుంది. నిమ్మనపల్లె పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిస్సా రాష్ట్రం, ఇందుపూర్ జమ్మాలియాకు చెందిన ధ్యానచంద్ర నాయక్ కుమారుడు గౌరీ శంకర్ నాయక్ (27) ఉపాధి నిమిత్తం అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గం లోని నిమ్మనపల్లె మండలం, భూమలగడ్డ సమీపంలోని బోయకొండ అడవిలో ఉన్న కోళ్ల ఫారంలో పనిచేయడానికి ఐదేళ్ల క్రితం వచ్చాడు. కోళ్ల ఫారాల వద్ద కాపలాదారుగా పనిచేస్తున్నాడు. ఆదివారం తెల్లవారు జామున తన పనిచేస్తున్న ప్రాంతంలో విగతజీవిగా పడి ఉండటాన్ని స్థానికులు గమనించారు. అపస్మారక స్థితిలో ఉన్న గౌరీశంకర్ నాయక్ను వెంటనే మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు, అతను అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. శనివారం అర్ధరాత్రి సమయంలోనే మృతి చెంది ఉండొచ్చని ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు. యువకుడి మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇది ప్రమాదవశాత్తూ జరిగిన మరణమా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


