కంచే చేను మేస్తోంది !
● సామాజిక భద్రత పెన్షన్లలో
సచివాలయం సిబ్బంది చేతివాటం
● అరవీడు,గోపనపల్లె గ్రామాల్లో
6.50 లక్షల నిధులు గోల్ మాల్
గాలివీడు : ప్రజలకు, ప్రభుత్వానికి జవాబుదారీతనంగా పనిచేయాల్సిన సచివాలయం సిబ్బంది చేతివాటంతో ప్రభుత్వ ఖజానాకు గండి పడుతోంది. వివరాల్లోకి వెళితే గాలివీడు మండలంలో ప్రతి నెలా 1 నుంచి 3 వతేదీ వరకు వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ,దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఇచ్చే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది.నిబంధనల మేరకు పెన్షన్ల పంపిణీ అనంతరం ప్రతి నెలా 4, 5 వ తేదీల్లో మిగిలిన సొమ్మును లెక్కగట్టి గ్రామపంచాయతీ కార్యదర్శి సమక్షంలో ప్రభుత్వ ఖజానాకు బ్యాంకులో జమ చేయాలి. అయితే సచివాలయం సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తుండటంతో ఖజానాకు చేరాల్సిన సొమ్ము పక్కదారి పడుతోంది.అరవీడు గ్రామంలో 2025–26 సంవత్సరానికి గాను ఆగస్టు, అక్టోబర్, నవంబర్, డిసెంబర్,జనవరి మాసాల్లో మిగులు సొమ్ము రూ.4,08,000 ప్రభుత్వ ఖజానాకు జమ కాలేదు.అలాగే గోపనపల్లె గ్రామంలో .2021–22 జనవరి నుంచి 2025–26 జనవరి వరకూ దాదాపు నాలుగు సంవత్సరాలుగా మిగులు పెన్షన్ల సొమ్ము రూ.2,46,000 ఖజానాకు కాకుండా సచివాలయం సిబ్బంది జేబుల్లోకి వెళ్లడం పలు సందేహాలకు దారితీస్తోంది.అయితే సంబంధిత శాఖ డీఆర్డీఏ నుంచి ఎప్పటికప్పుడు స్వాహా చేసిన సొమ్మును రికవరీ చెయ్యాలని ఎంపీడీఓ కార్యాలయానికి సమాచారం ఇస్తున్నప్పటికీ స్థానిక యంత్రాంగం భాధ్యతరాహిత్యంగా వ్యవహరిస్తూ నిధుల దుర్వినియోగంలో పరోక్షంగా భాగస్వాములు అవుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.ఇప్పటికై నా జిల్లా యంత్రాంగం ఈ అక్రమాలపై విచారణ జరిపి ప్రభుత్వ సొమ్మును రికవరీ చేసి,అక్రమార్కులపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
మెమోలు ఇస్తున్నాం
మిగులు పెన్షన్ సొమ్ము ప్రభుత్వ ఖజానాకు జమ చేయని సిబ్బందికి మెమోలు ఇస్తున్నాం. నిబంధనలకు విరుద్ధంగా పెన్షన్ సొమ్ము దుర్వినియోగం చేస్తే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సొమ్ము రికవరీ కోసం చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
– చంద్రమౌళీశ్వర్, ఎంపీడీఓ, గాలివీడు.


