అ పరిష్కారవేదిక
● సమస్యలతో పదేపదే కలెక్టరేట్కు వస్తున్న బాధితులు
● ఎన్నిమార్లు తిరిగినా
కనిపించని ప్రయోజనం
సాక్షి అన్నమయ్య : అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లెలోని కలెక్టరేట్లో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వినతులు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోని సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు తమ బాధతలను చెప్పుకునేందుకు పరుగులు పెడుతూ వస్తున్నారు. అనేక రకాల సమస్యలతో సతమతమవుతూ ఉన్నతాధికారులకు విన్నవించుకుంటే తీరుతాయని ఆశతో వస్తున్నారు. ఉన్నతాధికారులు ఆదేశాలు ఇస్తున్నా కిందిస్థాయిలో పెద్దగా పట్టించుకోక పోవడంతో వచ్చిన వారే పదేపదే వస్తున్నారు. చంద్రబాబు సర్కార్ ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తోంది. అయితే, సమస్యలు పరిష్కారం కాకుండా వచ్చిన వారే మళ్లీ వస్తుండడం ఆందోళన కలిగించే పరిణామం.
భారీగా దరఖాస్తుదారులు
మదనపల్లె జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని అధికారులు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు.పెద్ద ఎత్తున బాధిత ప్రజలు వస్తున్నా చిన్నపాటి సమస్యలకు కూడా పరిష్కారం లభించడం లేదు. ఎక్కువగా భూములకు సంబంధించిన సమస్యలు, నూతన పెన్షన్లు, రేషన్కార్డులు, ఇంటి స్థలాల ఆక్రమణ తదితర అంశాలపై ఎక్కువ మంది వస్తున్నారు. మదనపల్లెలోని కలెక్టరేట్లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రతి వారం 200–300 మంది వస్తున్నారు. సమస్యలు పరిష్కారం కాకుండా వచ్చినవారే మళ్లీమళ్లీ వస్తున్ననేపధ్యంలో అధికారులు పునరాలోచన చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.
రేషన్ కార్డు పునరుద్ధరించాలి
తన రేషన్ కార్డు 2023 సంవత్సరంలో రద్దు కావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. పేద వర్గానికి చెందిన తమ కుటుంబం కార్డు కోల్పొవడంతో ఉచిత బియ్యం పొందలేక పోతున్నాం. అలాగే రేషన్ కార్డు లేకపోవడం వల్ల పింఛన్కు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. నూతన రేషన్ కార్డు మంజూరు చేయడంతో పాటు పింఛన్ మంజూరు చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి పొందేలా చర్యలు తీసుకోవాలి.
– తలారి రెడ్డెమ్మ, వృద్దురాలు, పూజారివారిపల్లె, కురబలకోట మండలం
భూమి విషయంగా తగిన న్యాయం చేయాలి
తనకు చెందిన సర్వేనెంబర్ 1458 లో 1.75 విస్తీర్ణం గల భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగించేవాడిని. ప్రభుత్వం చేపట్టిన రీసర్వే ప్రక్రియలో తాను సాగు చేస్తున్న భూమి తనదికాదని వీఆర్ఓ, మండల సర్వేయర్ తెలిపారు. ఈ నేపథ్యంలో, సంబంధిత రికార్డులను పరిశీలించి, వీఆర్ఓ లేదా సర్వేయర్ సమక్షంలో మళ్లీ రీసర్వే నిర్వహించి తనకు చెందిన వాస్తవ భూమిని చూపించాలని కోరుతున్నాను.
– వై.నరసింహులు నాయుడు,
ఎర్రమద్దువారిపల్లె, కురబలకోట మండలం
ఆక్రమణలపై అధికారుల నిర్లక్ష్యం
మదనపల్లె మండలం కోళ్లబైలు గ్రామంలో ప్రభుత్వభూముల ఆక్రమణ లపై రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కోళ్లబైలు సర్వే నంబర్.672–1లో ప్రభుత్వభూమి ఆక్రమణలు గుర్తించి నోటీసులు జారీచేసి నెలలు గడుస్తున్నా తొలగించేందుకు చర్యలు తీసుకోలేదు. హైవే పక్కన కోట్ల విలువచేసే ప్రభుత్వభూమి ఆక్రమణపై అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో కబ్జాదారులు వేరొకరికి విక్రయించి సొమ్ములు చేసుకుంటున్నారన్నారు. కొనుగోలు చేసిన పేదలు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది.
– పునీత్కుమార్, బహుజన యువసేన నాయకులు
అ పరిష్కారవేదిక
అ పరిష్కారవేదిక


