అరకు ఎమ్మెల్యే రేగం మత్య్సలింగం
అరకులోయటౌన్(పాడేరురూరల్): సచివాలయ ఉద్యోగులు అందుబాటులో లేకపోయినా, సక్రమంగా విధులు నిర్వహించకపోయినా ఉపేక్షించేది లేదని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం హెచ్చరించారు. అరకులోయ మండలం సిర్గం పంచాయతీలో సోమవారం ఆయన పర్యటించారు. గ్రామ సచివాలయాన్ని సందర్శించి, రికార్డులు పరిశీలించారు. సెక్రటరీ వారం రోజుల నుంచి విధులకు హాజరుకావడం లేదని తెలుసుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సెక్రటరీని తక్షణం సస్పెండ్ చేయాలని జిల్లా పంచాయతీరాజ్ అభివృద్ధి అధికారిని ఎమ్మెల్యే ఆదేశించారు. అనంతరం స్థానిక మండల పరిషత్ పాఠశాలను సందర్శించారు. పాఠశాల ఉపాధ్యాయుడు విధులకు డుమ్మాకొడుతున్నట్టు తెలుసుకుని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుడిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారికి సిఫారసు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉద్యోగులు విధులపట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. కింది స్థాయి ఉద్యోగులు ఏవిధంగా విధులకు హాజరవుతున్నారో సంబంధిత అధికారులు పర్యవేక్షించడపోడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఉమ్మడి విశాఖ ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షుడు కమిడి అశోక్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.


