
సాక్షి, హైదరాబాద్: ఫుట్సల్ అండర్–13 జాతీయ ఫుట్బాల్ చాంపియన్షిప్లో తెలంగాణ జట్టు చాంపియన్గా నిలిచింది. కొచ్చి రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ టోర్నీలో చివరివరకు అజేయంగా నిలిచి టైటిల్ను కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో పెనాల్టీ షూటౌట్లో మహారాష్ట్రపై తెలంగాణ విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన ఈ టైటిల్పోరులో నిర్ణీత సమయం ముగిసేవరకు ఇరు జట్లు 1–1తో సమంగా నిలిచాయి.
విజేతను తేల్చేందుకు పెనాల్టీ షూటౌట్ను నిర్వహించగా... తెలంగాణ తరఫున లోకేశ్, వంశీకృష్ణ, ప్రథమ్ జోషి గోల్స్ నమోదు చేశారు. గోల్కీపర్ ధన్వితేజ్... మహారాష్ట్ర ఆటగాళ్ల రెండు గోల్స్ను అడ్డుకొని తెలంగాణను విజేతగా నిలిపాడు. అంతకుముందు సెమీస్లో తెలంగాణ 3–0తో గుజరాత్పై గెలిచింది. జాసన్ పావెల్ 2 గోల్స్ చేయగా, పీయూశ్ ఒక గోల్ సాధించాడు. లీగ్ మ్యాచ్ల్లో తెలంగాణ 1–0తో మహారాష్ట్రపై, 5–1తో ఢిల్లీపై, 3–0తో ఆంధ్రప్రదేశ్పై గెలిచి ముందంజ వేసింది. ఈ విజయంపై తెలంగాణ రాష్ట్ర ఫుట్సల్ సంఘం అధ్యక్షుడు టి.సంజయ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.