Futsal League
-
ఫుట్సల్ ప్రపంచ కప్కు మనోళ్లు
సాక్షి, హైదరాబాద్: ఫుట్బాల్ క్రీడలో భవిష్యత్ స్టార్లుగా ఎదిగేందుకు తెలంగాణ రాష్ట్ర క్రీడాకారులు వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఏఎంఎఫ్ సి–13 ఫుట్సల్ (ఇండోర్ ఫుట్బాల్) ప్రపంచకప్లో తమదైన ముద్ర వేసేందుకు తెలంగాణకు చెందిన ఎనిమిది మంది చిన్నారులు సన్నద్ధమయ్యారు. బార్సిలోనా వేదికగా ఈనెల 28 నుంచి నవంబర్ 3 వరకు జరుగనున్న ఫుట్సల్ ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టుకు రాష్ట్రానికి చెందిన ఎనిమిది మంది క్రీడాకారులు ఎంపికయ్యారు. కొంపల్లిలోని డెకథ్లాన్ ఫుట్సల్ కోర్టులో ఏర్పాటు చేసిన అండర్–13 జాతీయ స్థాయి శిక్షణా శిబిరంలో మెరుగైన ప్రదర్శన కనబరిచిన 11 మంది క్రీడాకారులను శుక్రవారం భారత జట్టుకు ఎంపిక చేశారు. ఇందులో తెలంగాణకు చెందిన 8 మంది చోటు దక్కించుకోగా... ఆంధ్రప్రదేశ్, ఉత్తర్ప్రదేశ్, మహారాష్ట్రలకు చెందిన ఒక్కో ప్లేయర్కు స్థానం దక్కింది. ఈ జట్టుకు కెపె్టన్గా కెవిన్ మార్క్, కోచ్గా నికోలస్ ఫెర్నాండేజ్ వ్యవహరిస్తారు. తెలంగాణ ఫుట్సల్ అసోసియేషన్, స్కైకింగ్స్ ఎఫ్సీ జట్లకు కోచ్గా వ్యవహరిస్తోన్న నికోలస్ ఆధ్వర్యంలో తెలంగాణ ఫుట్సల్ జట్టు గత కొంత కాలంగా నిలకడగా విజయాలు నమోదు చేస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కొచ్చి వేదికగా జరిగిన జాతీయ ఫుట్సల్ చాంపియన్షిప్లో విజేతగా నిలిచిన తెలంగాణ జట్టు... ఆగస్టులో గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన నేషనల్ చాంపియన్షిప్లో మూడో స్థానాన్ని దక్కించుకుంది. జట్టు వివరాలు: ప్రథమ్ జోషి, ధన్వీ తేజస్, ఆకాశ్ ప్రధాన్, శ్లోక్ అశోధ, హర్ష ప్రకాశ్ సింగ్, కెవిన్ మార్క్, జాసన్ పావెల్, ఆర్యన్ (తెలంగాణ), కార్తీక్ (ఆంధ్రప్రదేశ్), శివమ్ (మహారాష్ట్ర), లక్ష్య (ఉత్తర్ప్రదేశ్). -
చాంపియన్ తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: ఫుట్సల్ అండర్–13 జాతీయ ఫుట్బాల్ చాంపియన్షిప్లో తెలంగాణ జట్టు చాంపియన్గా నిలిచింది. కొచ్చి రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ టోర్నీలో చివరివరకు అజేయంగా నిలిచి టైటిల్ను కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో పెనాల్టీ షూటౌట్లో మహారాష్ట్రపై తెలంగాణ విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన ఈ టైటిల్పోరులో నిర్ణీత సమయం ముగిసేవరకు ఇరు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. విజేతను తేల్చేందుకు పెనాల్టీ షూటౌట్ను నిర్వహించగా... తెలంగాణ తరఫున లోకేశ్, వంశీకృష్ణ, ప్రథమ్ జోషి గోల్స్ నమోదు చేశారు. గోల్కీపర్ ధన్వితేజ్... మహారాష్ట్ర ఆటగాళ్ల రెండు గోల్స్ను అడ్డుకొని తెలంగాణను విజేతగా నిలిపాడు. అంతకుముందు సెమీస్లో తెలంగాణ 3–0తో గుజరాత్పై గెలిచింది. జాసన్ పావెల్ 2 గోల్స్ చేయగా, పీయూశ్ ఒక గోల్ సాధించాడు. లీగ్ మ్యాచ్ల్లో తెలంగాణ 1–0తో మహారాష్ట్రపై, 5–1తో ఢిల్లీపై, 3–0తో ఆంధ్రప్రదేశ్పై గెలిచి ముందంజ వేసింది. ఈ విజయంపై తెలంగాణ రాష్ట్ర ఫుట్సల్ సంఘం అధ్యక్షుడు టి.సంజయ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. -
‘ఫుట్సల్ లీగ్’తో కోహ్లి కటీఫ్
ఫుట్బాల్ ప్రీమియర్ ఫుట్సల్ లీగ్కు గత ఏడాది బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించిన భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి దాని నుంచి తప్పుకున్నాడు. ఈ లీగ్కు అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) గుర్తింపు లేకపోగా... గుర్తింపు పొందిన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో ఒక జట్టుకు యజమాని అయిన కోహ్లి మరో ప్రైవేట్ లీగ్తో జత కట్టడాన్ని ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ ప్రశ్నించారు. కోహ్లి దూరం కావడంతో ఇకపై అతని ఫొటోలు, వీడియోలు తమ లీగ్ ప్రచారంలో ఉపయోగించబోమని ఫుట్సల్ ప్రతినిధులు స్పష్టం చేశారు.