ఇంటి టెర్రస్‌పై ఆటాడుకున్న ధావన్‌

Dhawan Playing Cricket On The Terrace of His Family Home - Sakshi

న్యూఢిల్లీ: నిత్యం క్రికెట్‌ మ్యాచ్‌లు, ప్రాక్టీస్‌ సెషన్‌లతో బిజీగా ఉండే టీమిండియా క్రికెటర్లకు చిన్న విరామం దొరకడంతో ప్రస్తుతం సేద తీరుతున్నారు. ఈ గ్యాప్‌లో వచ్చిన దీపావళి పండుగను కుటుంబసభ్యులతో సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. ఇప్పటికే విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మలు కుటుంబసభ్యులతో కలిసి చేసిన ఎంజాయ్‌ అంతా ఇంతా కాదు. తాజాగా ఈ జాబితాలో టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ చేరాడు. 

శిఖర్‌ ధావన్‌ ఇంటాబయటా చేసే వినోదం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మైదానంలో అభిమానులను ఉత్సాహపరచడానికి స్టెప్పులేయడం.. అదేవిధంగా డ్రెస్సింగ్‌ రూమ్‌లో, ట్రావెలింగ్‌లో సహచర ఆటగాళ్లతో కామెడీ పండించడం చూస్తుంటాం. ముఖ్యంగా తన పిల్లలతో చేసే అల్లరి అంతా ఇంతా కాదు. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో తన అభిమానులతో ధావన్‌ పంచుకుంటాడు. తాజాగా  భాయ్‌ దూజ్ వేడుక సందర్భంగా తన కుటంబసభ్యులతో కలిసి సందడి చేశాడు. అదేవిధంగా ఇంటి టెర్రస్‌పై క్రికెట్‌ ఆడుతూ ధూమ్‌ధామ్‌ చేశాడు. 

వీటికి సంబంధించిన ఫోటోలను, వీడియోను షేర్‌ చేస్తూ తన పండుగ అనుభవాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ‘ఈ రోజు కుటుంబసభ్యులతో కలిసి చాలా సరదాగా గడిపాను. ఇలాంటి క్షణాలు నన్ను ఎప్పటికీ ఉత్సాహపరుస్తాయి. అందరికీ భాయ్‌ దూజ్  శుభాకాంక్షలు’, అంటూ ట్వీట్‌ చేశాడు. అంతేకాకుండా తన కుటంబ సభ్యులతో ఇంటి టెర్రస్‌పై క్రికెట్‌ ఆడిన వీడియోను కూడా ధావన్‌ షేర్‌ చేశాడు. కుటుంబ సభ్యులు ఫీల్డింగ్‌ చేస్తుంటే.. ధావన్‌ బ్యాటింగ్‌ చేశాడు.

ఇక ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా మ్యాచ్‌లో గాయపడిన ధావన్‌.. అర్దంతరంగా ఆ టోర్నీ నుంచి నిష్క్రమించాడు. అయితే గాయం నుంచి కోలుకొని వెస్టిండీస్‌ సిరీస్‌కు ఎంపికయ్యాడు. అయితే అంతగా ఆకట్టుకోలేదు. తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిని టీ20 సిరీలో 76 పరుగులు మాత్రమే చేసి నిరుత్సాహపరిచాడు. అయితే బంగ్లాదేశ్‌తో జరగబోయే టీ20 సిరీస్‌లో ధావన్‌ రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు. నవంబర్‌ 3 నుంచి ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ(కోట్లా)మైదానం వేదికగా బంగ్లా-భారత్‌ల మధ్య తొలి టీ20 జరగనుంది. 
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top