‘కాంగ్రెస్‌ను ముంచింది జైపాల్‌ రెడ్డే’

BJP president K laxman slams congress leaders - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భారతీయ జనతా పార్టీ గొంతుకగా ఓబీసీ మోర్చా పాల్గొంటుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ తెలిపారు. అయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఓబీసీ మోర్చా కొత్తగా ఏర్పడినప్పటికీ అనేక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటుందన్నారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరుపుకుంటున్నామని.. జిల్లాలో కూడా కార్యవర్గ సమావేశాలు నిర్వహించబోతున్నామన్నారు. ఈ నెల నుంచి పెద్ద ఎత్తున సభలు, సమావేశాలు, యాత్రలు చేపట్టబోతున్నామని తెలిపారు. భారత్ దేశం మొత్తం సాఫ్ నియంత్ సహీ వికాస్ పేరిటముందుకెళ్తున్నామని, దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగిన స్పష్టమైన అధికారం కట్టబెడుతున్నారని పేర్కొన్నారు. దేశంలో పేదవ్యక్తి ప్రధానిగా కొనసాగుతున్నారని, మోదీ పాలనను ప్రతిపక్షాలు సహించలేకపోతున్నాయని విమర్శించారు.

కాంగ్రెస్ నాయకులు మోదీపై కులం పేరుతో దూషిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ నేత జైపాల్‌ రెడ్డి మోదీపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఆయన ఎన్ని పార్టీలు మారారో అందరికి తెలుసనన్నారు. జైపాల్ రెడ్డి మాటలు దయ్యాలు వేదాలు మాట్లాడినట్టు ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించి ఆపార్టీని ముంచిన వ్యక్తి ఇప్పుడు ఇలా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. మోర్చా సేవలు గ్రామ గ్రామన, పల్లె పల్లెకు విస్తరిస్తామన్నారు. బీసీల గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని తెలిపారు. ఒక్క బీసీ ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకోలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఉందన్నారు. వేల కోట్లు ప్రచారం కోసం ఖర్చు పెడుతున్నారు కానీ, పేద వారికి ఇల్లు కట్టించలేని దుస్థితిలో కేసీఆర్ పాలన ఉందన్నారు. తెలంగాణ దేశంలో ఆఖరి స్థానంలో ఉందని జాతీయ నాయకులు అంటున్నారని లక్ష్మణ్‌ వ్యాఖ్యానించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top