'అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం' | Sakshi
Sakshi News home page

అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: అమిత్‌ షా

Published Sun, Jan 5 2020 4:07 PM

Amit Shah Attacks On Congress And AAP - Sakshi

న్యూఢిల్లీ: మోదీ నాయకత్వంలో ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. ఆదివారం రోజున న్యూఢిల్లీలో జరిగిన  'బూత్ కార్యకర్త సమ్మేళన్'కు హాజరైన అమిత్‌ షా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు దళిత వ్యతిరేక పార్టీలని విమర్శించారు. ఢిల్లీ ప్రజలను కేజ్రీవాల్ ఎంతోకాలం మభ్యపెట్టి.. మోసగించలేరన్నారు. రాబోయే ఎన్నికల్లో నరేంద్రమోదీ నాయకత్వంలో.. ఇక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతుందన్నారు.

చదవండి: వెనక్కితగ్గం

పాక్‌లోని నాన్‌కనా సాహెబ్ గురుద్వారాపై దాడి విషయంలో కాంగ్రెస్ వైఖరి ఏంటో చెప్పాలని ఈ సందర్భంగా ఆయన నిలదీశారు. సిక్కులపై దాడులు జరుగుతుంటే కాంగ్రెస్ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. సీఏఏకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వారికి నాన్‌కనా సాహెబ్ గురుద్వారాపై జరిగిన దాడే సమాధానమన్నారు. ఆ దాడిలో గాయపడిన సిక్కులు ఎక్కడకు వెళ్తారని అమిత్‌ షా ప్రశ్నించారు. పౌరసత్వ సవరణ చట్టంపై దేశాన్ని కాంగ్రెస్, ఆప్ తప్పుదారి పట్టిస్తున్నాయంటూ మండిపడ్డారు. సీఏఏకు వ్యతిరకేంగా రాహుల్, ప్రియాంక హింసను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.

సీఏఏపై  తమ పార్టీ ఇంటింటికి వెళ్లి ప్రచారం సాగిస్తుందని, ప్రజలకు వాస్తవాలు వివరిస్తుందని హామీ ఇచ్చారు. సీఏఏ విషయంలో ప్రభుత్వం వెనుకడుగు వేయబోదని హోంమంత్రి, బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు సీఏఏపై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడానికే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. మూడు కోట్ల మంది ప్రజలకు చేరేలా 500 ర్యాలీలను నిర్వహిస్తామన్నారు. సీఏఏపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు నేటి నుంచి ఇంటింటి ప్రచారం చేపట్టనున్నట్లు బీజేపీ తెలిపింది.

Advertisement
Advertisement