
పాక్ను దోషిగా నిలబెడదాం
ఉగ్ర పాకిస్తాన్ను అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబెట్టి ఏకాకిని చేసేందుకు వ్యూహాత్మకంగా, జాగ్రత్తగా, బహుళ అంచెల విధానంతో....
అంతర్జాతీయ సమాజం ముందు ఏకాకిని చేద్దాం
* యూరి దాడి సంఘటనల్ని రాష్ట్రపతికి వివరించిన ప్రధాని
* ప్రధాని ఆధ్వర్యంలోని ఉన్నతస్థాయి భేటీలో నిర్ణయం
* త్వరలో ఆధారాల్ని పాక్కు అందజేయనున్న భారత్
* ఇప్పటికిప్పుడు దాడి ఉద్దేశం లేదు: అధికార వర్గాలు
* యూరి దాడి ఘటనలో 18కి చేరిన మృతుల సంఖ్య
న్యూఢిల్లీ: ఉగ్ర పాకిస్తాన్ను అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబెట్టి ఏకాకిని చేసేందుకు వ్యూహాత్మకంగా, జాగ్రత్తగా, బహుళ అంచెల విధానంతో ముందడుగు వేయాలని భారత్ నిర్ణయించింది.పాక్ ప్రోత్సాహంతో సాగుతున్న ఉగ్రవాదంపై చర్యలు తీసుకొనేలా తగినన్ని ఆధారాలు సమర్పించి, ఆ దేశాన్ని ప్రపంచంలో ఒంటరి చేసేలా ఒత్తిడి పెంచేందుకు సిద్ధమైంది.
ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సోమవారం జరిగిన ఉన్నతస్థాయి భేటీలో నిర్ణయించినట్లు సమాచారం. ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ వేదికలపై పాక్ ఉగ్రనీతిని బయట పెట్టాలని భేటీలో తీర్మానించారు. ఉగ్రవాదులు వాడిన పాక్ తయారీ ఆయుధాలు, ఆహారం, శక్తినిచ్చే పానీయాలు, భారత్లో ప్రవేశించేందుకు ఉపయోగించిన జీపీఎస్ పరికరాల్ని పాక్కు అందచేసి ఆ దేశాన్ని గట్టిగా నిలదీయనుంది. ఈ బాధ్యతను సైనిక కార్యకలాపాల డెరైక్టర్ జనరల్కు అప్పగించారు. యూరి ఉగ్రదాడి అనంతరం ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై చర్చించేందుకు నిర్వహించిన ఈ కీలక సమావేశంలో హోం మంత్రి రాజ్నాథ్ , రక్షణ మంత్రి పరీకర్, ఆర్థిక మంత్రి జైట్లీ, జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్, ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దాడి అనంతరం కశ్మీర్ లోయలో తాజా పరిస్థితిని అధికారులు ప్రధానికి వివరించారు.
పాక్లోని ఉగ్రవాద స్థావరాలపై సైనిక చర్య జరపాలన్న డిమాండ్ నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. దాడి సూత్రధారుల్ని శిక్షించకుండా వదిలిపెట్టబోమంటూ ఆదివారం ప్రధాని చెప్పడంతో ఉగ్రస్థావరాలపై భారత్ దాడి చేయొచ్చన్న ఊహాగానాలకు తెరలేచింది. అయితే ఎలాంటి తొందరపాటు చర్యకూ ప్రభుత్వం సిద్ధంగాలేదని ఉన్నత వర్గాల సమాచారం. ఇప్పటికిప్పుడు అలాంటి చర్య ఏదీ ఉండదని, పూర్తిస్థాయి వ్యూహరచన, సహకారం, అన్ని అనుకూలతల్ని పరిశీలించి, అందర్నీ సంప్రదించాకే చర్యకు ముందడుగు వేయాలనే నిర్ణయానికి వచ్చారని ఆ వర్గాలు తెలిపాయి. గతేడాది జూన్లో మణిపూర్లో ఎన్ఎస్సీఎన్-కే తీవ్రవాదులు 18 మంది సైనికుల్ని చంపిన అనంతరం భారత ఆర్మీ మయన్మార్ సరిహద్దులు దాటి వెళ్లి చేసిన దాడి చేయడం తెలిసిందే. అన్ని అనుకూలతలు పరిశీలించాకే వారం తర్వాత ఈ దాడి జరిపారు.
అవతలివైపు దూకుడుగా వ్యవహరించేది పాక్ అని, అందువల్లే తొందరపాటు చర్య ఉండదనేది సమాచారం. తీవ్ర భావావేశాలు, ఆగ్రహాన్ని పరిగణనలోకి తీసుకుని ఎలాంటి చర్య ఉండదని విదేశాంగ సహాయ మంత్రి వీకే సింగ్ కూడా స్పష్టం చేశారు. మరోవైపు యూరి ఉగ్రదాడి పరిణామాలపై రాష్ట్రపతి ప్రణబ్కు ప్రధాని మోదీ వివరించారు. ఉన్నత స్థాయి భేటీ తర్వాత రాష్ట్రపతి భవన్లో ప్రణబ్ను కలిశారు. యూరి దాడిపై తగిన సమయంలో, తగిన చోట గుణపాఠం చెబుతామని ఆర్మీ పేర్కొంది.
రాజ్నాథ్ ఆధ్వర్యంలో సమీక్ష
సరిహద్దులతో పాటు జమ్మూ కశ్మీర్లో భద్రతా పరిస్థితిపై హోం మంత్రి రాజ్నాథ్ నేతృత్వంలో రక్షణ మంత్రి పరీకర్, ఉన్నత భద్రతా అధికారులు ప్రత్యేకంగా చర్చించారు. నియంత్రణ రేఖ, కశ్మీర్ లోయలో తాజా పరిస్థితిని భద్రతా సలహాదారు దోవల్, ఆర్మీ చీఫ్, హోం, రక్షణ, పారా మిలటరీ దళాల ఉన్నతాధికారులు రాజ్నాథ్కు వివరించారు.
మరొక జవాను మృతి..
యూరి దాడిలో ప్రాణాలు కోల్పోయిన వీర సైనికుల సంఖ్య 18కి చేరింది. గాయపడ్డ సిపాయ్ కె.వికాస్ జనార్ధన్ను హెలికాప్టర్లో ఢిల్లీ ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మరణించారు. జవాన్ల భౌతిక కాయాలకు శ్రీనగర్లో కశ్మీర్ సీఎం మెహబూబా, ఆర్మీ, పోలీసు అధికారులు ఘనంగా నివాళులర్పించారు. అమర జవాన్లలో ఇద్దరు కశ్మీరీలు కాగా, యూపీ(4), బిహార్(3), మహారాష్ట్ర(4), పశ్చిమ బెంగాల్(2), జార్ఖండ్(2), రాజస్తాన్(1)కు చెందినవారు ఉన్నారు.
అమెరికా సాయం కోరిన పాక్
న్యూయార్క్: భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల పరిష్కారానికి సాయం చేయాలని పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ అమెరికాను అర్థించారు. ఆయన అమెరికా విదేశాంగ మంత్రి కెర్రీతో సమావేశమై కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనలను లేవనెత్తారు. కశ్మీర్లో 107 మందికి పైగా ప్రజల్ని చంపేశారని, వేయి మంది గాయాలపాలయ్యారని, ప్రభుత్వ ప్రమేయంతోనే అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ప్రధాని చెప్పినట్లు పాకిస్తాన్ ప్రకటన విడుదల చేసింది. ఐరాస 71వ సాధారణ సమావేశాలకు హాజరయ్యేందుకు షరీఫ్ అమెరికా వచ్చారు.
యూరికి ఒక రోజు ముందే ఉగ్రవాదులు
యూరి దాడిపై పూర్తి స్థాయి విచారణను ఆర్మీ మొదలుపెట్టింది. నిర్ణీత కాలవ్యవధిలో విచారణ పూర్తవుతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. వాస్తవాధీన రేఖ దాటిన అనంతరం తొలుత కనిపించిన ఆర్మీ స్థావరం, భద్రతా సంస్థపై దాడి చేసేందుకు ఉగ్రవాదులు చొరబడ్డారని అధికార వర్గాలు అంచనాకు వచ్చాయి. దాడికి దారితీసిన అన్ని లోపాల్ని పరిశీలించడంతో పాటు... అసలు దాడిని నివారించే పరిస్థితి ఉందా? అన్నదానిపైనా విచారణ కొనసాగుతుంది.
ఇకపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సరిహద్దు వెంట సైనిక స్థావరాల్లో బలగాల మార్పు చేర్పులపై కూడా కమిటీ సూచనలు చేయనుంది. మరోవైపు ప్రాథమిక విచారణ ప్రకారం... దాడికి కనీసం ఒక రోజు ముందే ఉగ్రవాదులు యూరికి చేరుకున్నారని తేలింది. ఎప్పుడూ గడ్డం గీసుకునే ఉగ్రవాదులకు(ఆత్మాహుతి దళం)... ఒక రోజు కంటే ఎక్కువ పొడవైన గడ్డం ఉండడంతో ఈ అంచనాకు వచ్చారు.
సైనిక చర్యే ఉత్తమం
వాషింగ్టన్: ఉగ్రవాదం అణచివేతకు సైనిక శక్తి వినియోగం సరైందని ఐదింట మూడింతలకు పైగా భారతీయులు తెలిపారని అమెరికాకు చెందిన ‘ప్యూ రీసెర్చ్ సెంటర్’ సర్వేలో తేలింది. సర్వే ప్రకారం.. చాలా మంది పాక్పై మోదీ అనుసరిస్తున్న విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత్కు ఐసిస్ ప్రధాన ముప్పు కానుందని 52 శాతం మంది ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదాన్ని ఓడించేందుకు సైనిక శక్తిని ఉపయోగించడం ఉత్తమమని 62 శాతం మంది చెప్పారు. పాక్ పట్ల మోదీ విదేశాంగ విధానాన్ని 22 శాతమే ఆమోదించగా... రక్షణ రంగంలో మరింత ఖర్చు పెట్టాలని చాలా మంది చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్ 7 నుంచి మే 24 మధ్యలో మొత్తం 2,464 మందిని సర్వే చేశారు.