స్త్రీలోక సంచారం

Woman's Wandering - Sakshi

ఎక్కడ మిస్‌ అయినా.. ఇక్కడ మిస్‌ అవరు!

  ‘చాకలి ఐలమ్మ’గా గుర్తింపు పొందిన తెలంగాణ వీర వనిత చిట్యాల ఐలమ్మ (1919–1985) విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం త్వరలో హైదరాబాద్‌లో ప్రతిష్ఠించబోతోంది. వరంగల్‌ జిల్లా రాయపర్తి మండలం క్రిష్ణాపురం గ్రామంలో జన్మించిన ఐలమ్మ.. పెత్తందారీ భూస్వామ్య వ్యవస్థ అకృత్యాలకు, నిజాం ప్రభుత్వ అరాచకాలకు వ్యతిరేకంగా ఎర్రజెండా పట్టి పోరాడారు.
  ఏటా జరుగుతున్న విధంగానే వక్ఫ్‌ బోర్డుల నేతృత్వంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, మదరసాలు, కార్యనిర్వాహక సంస్థలలో స్వాతంత్య్ర దినోత్సవం నాడు జాతీయ పతాకాన్ని ఎగుర వేయడంతో పాటు.. ‘భారత్‌ మాతా కీ జై’ అనే నినాదాన్ని కూడా తప్పనిసరిగా పలికించాలని ఉత్తరప్రదేశ్‌ షియా బోర్డు చీఫ్‌ వసీమ్‌ రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు. ‘భారతదేశం నా జన్మభూమి’ అని చెప్పుకుంటున్నవారు, మన స్వాతంత్య్ర సంగ్రామాన్ని నడిపించిన ‘భారత్‌ మాతా కీ జై’ అనే నినాదాన్ని ఉచ్చరించబోమని చెప్పడంలో అర్థం లేదని రజ్వీ అన్నారు.
  భారత ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సంక్షేమ పథకాలే తనకు ఎన్నికల ప్రచారాన్ని చేసి పెడతాయని అంటూ తనదైన శైలిలో ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు. ‘‘జార్ఖండ్‌లోని ఒక మారుమూల గ్రామం. ఆ గ్రామంలో ఒక నిరుపేద మహిళ. కట్టెల పొయ్యి మీద అవస్థ పడుతూ ఇంట్లోవాళ్లందరికీ వంట చేసి పెట్టేది. ఉజ్వల స్కీమ్‌ కింద ఆమెకు గ్యాస్‌ స్టవ్‌ వచ్చింది. ఇప్పుడు ఆమె ముఖం పొగతో మసిబారడం లేదు. అనారోగ్యంతో ఆమె బాధ పడటం లేదు. వంట త్వరగా అయిపోతోంది. సమయం చాలా కలిసి వస్తోంది. ఆ సమయాన్ని వేరే డబ్బులొచ్చే పనికి, పిల్లల సంరక్షణకు ఆ ఇల్లాలు ఉపయోగించుకుంటోంది’’ అని చెబుతూ, ఇంతకు మించి నా ప్రభుత్వానికి ప్రచారం ఉంటుందా? అని మోదీ అన్నారు.
  11 ఏళ్ల థాయ్‌లాండ్‌ బాల వధువుకు 41 ఏళ్ల మలేసియా వరుడి మూడవ భార్యగా జరిగిన పెళ్లిపై థాయ్‌లాండ్‌ దేశవ్యాప్తంగా సోషల్‌ మీడియాలో వెల్లువెత్తిన తీవ్ర ఆగ్రహావేశాలు తిరిగి ఆ చిన్నారిని స్వదేశం తెప్పించేందుకు తోడ్పడ్డాయి. మత న్యాయస్థానాల అనుమతితో 16 ఏళ్ల లోపు బాలికలను వివాహం చేసుకోడానికి మలేసియాలో ఉన్న వెసులుబాటును ఉపయోగించుకుని పెళ్లి చేసుకున్న ఆ వ్యాపారి చెర నుంచి బాలికను రక్షించిన థాయ్‌ అధికారులు ప్రస్తుతం ఆమెకు కౌన్సెలింగ్‌ ఇప్పిస్తున్నారు.
  ‘వరల్డ్‌ మీటింగ్‌ ఆఫ్‌ ఫ్యామిలీస్‌’ (డబ్లు్య.ఎం.ఎఫ్‌) ఈవెంట్‌లో భాగంగా ఐర్లండ్‌లోని దుబ్లిన్‌లో ఈ నెల 25న ‘మహిళా నాయకత్వం–అంతర్జాతీయ ప్రభావం’ అనే అంశంపై సదస్సు జరుగుతోంది. డబ్లు్య.ఎం.ఎఫ్‌ ఈవెంట్‌లో మొదటిసారి జరుగుతున్న ఈ సదస్సు ఆ రోజు ఉదయం 8 గం.లకు మొదలై 11 గం.లకు ముగుస్తుందని, అదే రోజు ఉదయం 10.30 గం.లకు దుబ్లిన్‌ ఎయిర్‌పోర్ట్‌లో దిగే పోప్‌ ఫ్రాన్సిస్‌ ఈ మహిళా సదస్సుకు ఆఖరు నిముషంలోనైనా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని నిర్వాహకులు వెల్లడిం చారు.
  అందాల నటి శ్రీదేవి తొలి జయంతి నేడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో దుబాయ్‌లో సంభవించిన ఆమె ఆకస్మిక మరణం దేశాన్ని దిగ్బ్రాంతికి గురి చేసింది. శ్రీదేవి బతికి ఉంటే ఆమెకిది 55 వ పుట్టిన రోజు అయివుండేది. ఇటీవల విడుదలైన పెద్ద కూతురు జాహ్నవి తొలి సినిమా ‘ధడక్‌’ సక్సెస్‌ను చూసి ఆమె ఆనందించి ఉండేవారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top