స్థానిక అమృతానగర్లో ఓ ఆటో డ్రైవర్ విషద్రావణం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
ప్రొద్దుటూరు క్రైం: స్థానిక అమృతానగర్లో షేక్.ఖాజా(30) అనే ఆటో డ్రైవర్ విషద్రావణం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఖాజా పట్టణంలోని ఖాసిం డెకరేషన్ దుకాణంలో పని చేయడంతో పాటు ఆటో డ్రైవర్గా పని చేస్తుంటాడు. భార్యకు ఆరోగ్యం సరిగా లేదని అతను 7 నెలల క్రితం డెకరేషన్ షాపు యజమాని వద్ద రూ.1 లక్ష బాకీ తీసుకున్నాడు. అయితే షాపు యజమాని గత కొన్ని రోజుల నుంచి డబ్బు ఇవ్వమని బలవంత పెడుతున్నాడు. దీంతో ఖాజా సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో విషద్రావణం తాగగా, స్థానికులు గమనించి వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు పరిశీలించిన వైద్యుడు చెప్పారు. మంగళవారం అతని మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. భార్య ఖాదర్బీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తాలుకా ఎస్ఐ జిఎండి బాషా తెలిపారు.