visadravanam
-
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
కడప అర్బన్ : కడప టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మాచుపల్లె బస్టాండ్ వద్ద ఫొటో స్టుడియో పెట్టుకుని జీవనం సాగిస్తున్న మల్లికార్జున (35) అనే వ్యక్తి అప్పుల బాధ తాళలేక శనివారం షాపులో విషద్రావణం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కడప నగరంలోని అక్కాయపల్లెకు చెందిన మల్లికార్జున ఇటీవల మాచుపల్లె బస్టాండ్లో ప్రశాంత్ స్టుడియో పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. శనివారం ఉదయం 8 గంటలకు ఇంటి నుంచి వచ్చి స్టుడియో షట్టర్ తెరిచి లోపలికి వెళ్లాడు. విషద్రావణం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మధ్యాహ్నం భోజనం తీసుకుని వచ్చిన మృతుని భార్య మహేశ్వరమ్మ ఎంతసేపటికీ షట్టర్ తీయకపోవడంతో అనుమానం వచ్చి చుట్టుపక్కల వారిని పిలిపించి షట్టర్ పగుల గొట్టించింది. లోపల అపస్మారక స్థితిలో ఉన్న అతన్ని వెంటనే రిమ్స్కు తరలించారు. రిమ్స్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ పోలీసులు తెలిపారు. -
అప్పు తీర్చలేక ఆటో డ్రైవర్ ఆత్మహత్య
ప్రొద్దుటూరు క్రైం: స్థానిక అమృతానగర్లో షేక్.ఖాజా(30) అనే ఆటో డ్రైవర్ విషద్రావణం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఖాజా పట్టణంలోని ఖాసిం డెకరేషన్ దుకాణంలో పని చేయడంతో పాటు ఆటో డ్రైవర్గా పని చేస్తుంటాడు. భార్యకు ఆరోగ్యం సరిగా లేదని అతను 7 నెలల క్రితం డెకరేషన్ షాపు యజమాని వద్ద రూ.1 లక్ష బాకీ తీసుకున్నాడు. అయితే షాపు యజమాని గత కొన్ని రోజుల నుంచి డబ్బు ఇవ్వమని బలవంత పెడుతున్నాడు. దీంతో ఖాజా సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో విషద్రావణం తాగగా, స్థానికులు గమనించి వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు పరిశీలించిన వైద్యుడు చెప్పారు. మంగళవారం అతని మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. భార్య ఖాదర్బీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తాలుకా ఎస్ఐ జిఎండి బాషా తెలిపారు.