ఉద్యోగం రాలేదని ఆత్మహత్య | Women Committed Suicide | Sakshi
Sakshi News home page

ఉద్యోగం రాలేదని ఆత్మహత్య

Aug 25 2018 2:54 PM | Updated on Oct 9 2018 5:43 PM

Women  Committed Suicide  - Sakshi

మృతుడు అంజయ్య 

ఏటూరునాగారం : ఉద్యోగం రాలేదని ఓ పట్టబద్రుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన కావిరి సమ్మయ్య, లక్ష్మి దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడి వివాహం అయింది. ఎంఏ, బీఈడీ పూర్తి చేసిన చిన్న కుమారుడు అంజయ్య(25), టీటీసీ చేసిన కూతురు సౌందర్య ఇంటి వద్దే ఉంటున్నారు. అంజయ్య మూడేళ్లుగా పోటీ పరీక్షలకు హాజరవుతున్నాడు. గత ఏడాది గ్రూప్‌–2, ఈ ఏడాది టీఆర్‌టీ, గురుకుల పోటీ పరీక్షలు రాసాడు.

ఇటీవల విద్యావలంటరీ నియామక పరీక్షకు సోదరి సౌందర్యతోపాటు అంజయ్య హాజరుకాగా సౌందర్య సెలక్ట్‌ అయింది. మూడేళ్లుగా ఉద్యోగ ప్రయత్నం చేసినా ఫలితం దక్కడంలేదని అంజయ్య తరచూ చెప్పుకుని బాధపడేవాడని అతడి తల్లి లక్ష్మి తెలిపింది. శుక్రవారం ఉదయం తాను బయటకు వెళ్లి వచ్చేసరికి కుర్చీలో కూర్చొని ఉన్న అంజయ్య నోటి నుంచి వస్తున్న నురగలు వస్తున్నాయి.. ఏమైంది కొడుకా అని అడిగే లోపే వాంతులు చేసుకుంటూనే పురుగుల మందు తాగిన అవ్వా.. అంటూ పడిపోయాడని తల్లి విలపిస్తూ చెప్పింది. ఏటూరునాగారం ఆస్పత్రికి తీసుకువెళ్లగా డాక్టర్లు చికిత్స చేస్తుండగా చనిపోయాడని కన్నతల్లి గుండెలు బాదుకుంటూ రోదించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కన్నాయిగూడెం ఎస్సై శ్రీకాంత్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement