సానా సతీష్ ఇళ్లలో సోదాలు
కాకినాడ(తూర్పు గోదావరి జిల్లా): సీబీఐని కుదిపేసిన కేసులో నిందితుడిగా ఉన్న సానా సతీష్ ఇళ్లలో సీబీఐ బృందం సోదాలు నిర్వహించింది. పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం అందింది. ఓ కేసులో సీబీఐ అత్యున్నత అధికారిగా ఉన్న రాకేష్ ఆస్తానా మధ్యవర్తి ద్వారా రూ.5 కోట్లు లంచం అడిగారంటూ చేసిన ఆరోపణ సీబీఐలో కలకలం రేపింది. ఇదే వ్యవహారంలో ఓ సీబీఐ డీఎస్పీ అరెస్ట్ కావడంతో అందరి దృష్టి ఈ వ్యవహారంపై పడింది.
దేశంలోనే సంచలనంగా మారిన ఈ వ్యవహారంలో సానా సతీష్ కీలక వ్యక్తి అన్న సమాచారం ఈ ప్రాంతవాసుల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా చంద్రబాబుకు సన్నిహితంగా ఉండే ఓ టీడీపీ ఎంపీతో ఆయనకున్నసాన్నిహిత్యంపై ఇప్పుడు చర్చకు దారితీసింది. జిల్లాకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన అంశంలోనూ సానా సతీష్ క్రియాశీలకంగా వ్యవహరించాడని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. పార్టీ ఇచ్చే తాయిలాలు, నగదు లావాదేవీలను ఆయనే దగ్గరుండి జరిపించాడని చెబుతున్నారు.