వారికి ఐటీ శాఖ సీరియస్‌ వార్నింగ్‌ | Income Tax Department Warns Salaried Class Against Filing Wrong Returns | Sakshi
Sakshi News home page

వారికి ఐటీ శాఖ సీరియస్‌ వార్నింగ్‌

Apr 18 2018 5:56 PM | Updated on Apr 18 2018 5:57 PM

Income Tax Department Warns Salaried Class Against Filing Wrong Returns - Sakshi

న్యూఢిల్లీ : శాలరీ క్లాస్‌ పన్నుచెల్లింపుదారులకు ఆదాయపు పన్ను శాఖ సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చింది. ఐటీ రిటర్నుల్లో ఆదాయాన్ని తక్కువ చేసి చూపించినా.. తీసివేత/మినహాయింపులను అక్రమంగా పెంచినా ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదని హెచ్చరించింది.  ఎవరైనా ఈ ఉల్లంఘనలకు పాల్పడినట్టు తెలిస్తే వారిపై విచారణ చేపట్టనున్నామని, ఆ ఉద్యోగస్తులపై వారి ఎంప్లాయర్స్‌(సంస్థలు) కూడా కఠిన చర్యలు తీసుకోనున్నారని తెలిపింది. ప్రముఖ కంపెనీలకు చెందిన పలువురు ఉద్యోగులు మోసపూరితంగా ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రీఫండ్స్‌ ను క్లయిమ్‌ చేసుకుంటున్నారని ఇటీవల పలు రిపోర్టులు వచ్చాయి. 

పన్ను మధ్యవర్తుల ద్వారా తప్పుడు ఆదాయాలు చూపుతున్నట్టు తెలిపాయి. దీంతో ఆదాయపు పన్ను శాఖ ఈ అడ్వయిజరీ జారీచేసింది. ఆదాయాన్ని తక్కువ చేసి చూపించడం, తీసివేత/మినహాయింపులను అక్రమంగా పెంచడం వంటి మోసాలకు పాల్పడితే, ఆదాయపు పన్ను చట్టంలోని పలు పీనల్‌, ప్రాసిక్యూషన్ నిబంధనల కింద చర్యలు తీసుకుంటామని ఈ అడ్వయిజరీలో తెలిపింది. బెంగళూరుకు చెందిన ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ కంపెనీలోని పలువురు ఉద్యోగులు తప్పుడు మార్గాల ద్వారా పన్ను రీఫండ్స్‌ను పొందారని డిపార్ట్‌మెంట్‌కు చెందిన విచారణ విభాగం తేల్చిన సంగతి తెలిసిందే. ట్యాక్స్‌ అడ్వయిజరీలతో ఈ మోసాలకు పాల్పడినట్టు తెలిసింది. దీంతో శాలరీ క్లాస్‌ పన్ను చెల్లింపుదారులకు, ఐటీ శాఖ గట్టి వార్నింగ్‌ ఇచ్చింది. కాగ, శాలరీ క్లాస్‌ పన్ను చెల్లింపుదారుల ట్యాక్స్‌ ఫైలింగ్‌ సీజన్‌ను సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సస్‌ ప్రారంభించింది. కొత్త ఐటీఆర్‌ నిబంధనలను కూడా తీసుకొచ్చింది. 
 

Advertisement
 
Advertisement
Advertisement