
వెంకయ్య ప్రసంగాన్ని అడ్డుకున్న విద్యార్థులు
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించాలంటూ వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం నాయకులు కేంద్రమంత్రి గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి వెంకయ్యనాయుడు ప్రసంగాన్ని అడ్డుకున్నారు...
యూనివర్సిటీక్యాంపస్: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించాలంటూ వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం నాయకులు కేంద్రమంత్రి గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి వెంకయ్యనాయుడు ప్రసంగాన్ని అడ్డుకున్నారు. సోమవారం ఎస్వీయూలో 54వ స్నాతకోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా హాజరై స్నాతకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగాన్ని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు వి.హరిప్రసాద్రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు అడ్డుకున్నారు. స్నాతకోత్సవంలో వెంకయ్యనాయుడు ప్రసంగం ప్రారంభం కాగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.
రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్కు పదేళ్ల పాటు ప్రత్యేక హోదా కావాలంటూ రాజ్యసభలో మాట్లాడిన వెంకయ్యనాయుడు పదవి రాగానే ప్రత్యేక హోదా విషయాన్ని మరచిపోయారని వారు విమర్శించారు. మంత్రి తన మాట నిలుపుకుని ప్రత్యేక హోదా వచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్చేశారు. రాష్ట్రం విడిపోయాక అభివృద్ధిలో వెనుకపడిందని, ప్రత్యేక హోదా ద్వారానే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. చంద్రబాబు నాయుడు, వెంకయ్యనాయడు ప్రత్యేక హోదా కోసం పోరాడాలని కోరారు. దీంతో పోలీసులు విద్యార్థి సంఘం నాయకులను అరెస్టుచేసి, అనంతరం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు హేమంతకుమార్, జిల్లా కార్యదర్శి సురేష్నాయక్, క్యాంపస్ అధ్యక్షుడు మురళీధర్, కిషోర్రెడ్డి, రవీంద్రనాయక్ తదితరులు పాల్గొన్నారు.