జిల్లాకు ప్రొబేషనరీ ఐఏఎస్‌గా ఎస్‌ఎస్.మోహన్ | The district as a probationary IAS SS. Mohan | Sakshi
Sakshi News home page

జిల్లాకు ప్రొబేషనరీ ఐఏఎస్‌గా ఎస్‌ఎస్.మోహన్

Jun 17 2014 2:23 AM | Updated on Sep 27 2018 3:19 PM

ప్రాక్టికల్ ట్రైనింగ్ కోసం 2013 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన సాగిలి షాన్ మోహన్ జిల్లాకు రానున్నారు. ప్రొబేషనరీ ట్రైనింగ్ కోసం కొన్ని నెలల పాటు జిల్లాలో శిక్షణ పొందనున్నారు.

 శిక్షణ కోసం జిల్లాలో కొన్ని నెలల పాటు..
 
ఒంగోలు టౌన్: ప్రాక్టికల్ ట్రైనింగ్ కోసం 2013 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన సాగిలి షాన్ మోహన్ జిల్లాకు రానున్నారు.  ప్రొబేషనరీ ట్రైనింగ్ కోసం కొన్ని నెలల పాటు జిల్లాలో శిక్షణ పొందనున్నారు. ఈ మేరకు నూతన ఆంధ్రప్రదేశ్ సివిల్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు సోమవారం ప్రత్యేక జీవో విడుదల చేశారు. నూతన ఆంధ్రప్రదేశ్‌కు మొత్తం 10 జిల్లాలకు 10 మంది ప్రొబేషనరీ ఐఏఎస్‌లను కేటాయించారు.
 
అందులో భాగంగా ప్రకాశం జిల్లా ఎస్‌ఎస్ మోహన్‌ను శిక్షణ కోసం పంపించనున్నారు. ఆయన మంగళవారం నుంచి  జిల్లా స్థాయి రెవెన్యూ, పోలీస్ అధికారులతో కలిసి శిక్షణ పొందుతారు. మొదట ఒక వారం పాటు కలెక్టర్ కార్యాలయంలో అధికారులు చేస్తున్న విధులను ఆయన అవగాహన చేసుకుంటారు. అనంతరం మరో వారం పాటు జిల్లా ట్రెజరీ కార్యాలయంలో జరుగుతున్న లావాదేవీలు, ఆర్థికపరమైన అంశాల గురించి నేర్చుకుంటారు. ఆ తర్వాత రెండు వారాల పాటు జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీస్ అధికారులు రోజువారీ చేస్తున్న కార్యక్రమాలపై శిక్షణ పొందుతారు.
 
ఈ నాలుగు వారాల పాటు పొందిన శిక్షణకు సంబంధించిన నివేదికను హైదరాబాద్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ డెరైక్టర్ జనరల్‌కు అందజేస్తారు. అక్కడ మరో నాలుగు వారాల పాటు శిక్షణ పొందుతారు. ఆ తర్వాత రెండు వారాల పాటు కేంద్ర, రాష్ట్రాలకు చెందిన ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్‌లోనూ, బ్యాంకుల్లోనూ శిక్షణ తీసుకుంటారు. మరో రెండు వారాల పాటు హైదరాబాద్‌లోని సర్వే అండ్ సెటిల్‌మెంట్ విభాగానికి చెందిన కార్యాలయంలో తర్ఫీదు పొందుతారు. అనంతరం తిరిగి  కలెక్టర్ కార్యాలయానికి చేరుకుంటారు. ఇక్కడ కొన్ని వారాల పాటు గ్రామస్థాయి నుంచి మండలం, రెవెన్యూ డివిజన్, జిల్లా స్థాయి అధికారుల విధులకు సంబంధించిన అన్ని రకాల అంశాలపై శిక్షణ తీసుకుంటారు.

Advertisement
 
Advertisement
Advertisement