ప్రైవేట్ రంగంలోనూ రిజర్వేషన్లు

ప్రైవేట్ రంగంలోనూ రిజర్వేషన్లు - Sakshi


రాజ మండ్రి రూరల్/రాజానగరం/ప్రకాష్‌నగర్ :ప్రైవేట్ రంగంలో కూడా వికలాంగులకు రిజర్వేషన్లు కల్పించే లా జాబ్ మేళాలు చేపడతామని స్త్రీ, శిశు సంక్షేమం, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి పీతల సజాత అన్నారు. రాజమండ్రిలోని చెరుకూరి సుబ్బారావు, గన్నెమ్మ కల్యాణ మండపంలో బుధవారం నిర్వహించిన ప్రపంచ వికలాంగుల దినోత్సవ సభకు ఆమె అధ్యక్షత వహించారు. వికలాంగులకు కేటాయించిన ఖాళీలన్నింటినీ దశలవారీగా భర్తీ చేస్తామన్నారు. సమాన హక్కులు, అవకాశాలు కల్పిస్తూ, ఉపాధి అవకాశాలు చూపించేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నామన్నారు. రానున్న పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని రాజమండ్రిని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దేలా ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ విజ్ఞప్తి చేశారు. రోడ్ కమ్ రైలు బ్రిడ్జికి మరమ్మతులు చేపట్టాలని, వినియోగంలో లేని హేవ్‌లాక్ వంతెనను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని కోరారు. రాజమండ్రిని గ్రీన్ సిటీగా తయారుచేస్తూ, ఈ ప్రాంతంలోని నర్సరీల అభివృద్ధికి రీసెర్చ్ సంస్థను ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబునాయుడుకి విజ్ఞప్తి చేశారు. తొలుత జియోన్ బధిరుల పాఠశాల, ప్రియదర్శిని బధిరుల ఆశ్రమ పాఠశాల, పలుకు బధిరుల పాఠశాల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

 

 రూ.22 లక్షల విలువైన         ఉపకరణాలు పంపిణీ

 వికలాంగుల సంక్షేమ శాఖ ద్వారా సమకూర్చిన రూ.22 లక్షల విలువైన ఉపకరణాలను లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు అందజేశారు. వీటిలో 200 ట్రైసైకిళ్లు, 26 ల్యాప్‌ట్యాప్‌లు, 20 వీల్‌చైర్లు, 10 ఎంపీత్రీ ప్లేయర్లు, 100 వినికిడి యంత్రాలు, 10 మందికి కృత్రిమ అవయవాలు ఉన్నాయి. స్వయం ఉపాధి కోసం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, మెస్మాల ద్వారా వికలాంగుల సంఘాలకు రూ.56.81 లక్షల బ్యాంకు రుణాలను అందజేశారు. కల్యాణ మండపం ఆవరణలో ఏర్పాటుచేసిన 10 స్టాళ్లను సీఎం సందర్శించారు.ఆర్‌అండ్‌బీ అతిథి గృహానికి చేరుకున్న సీఎంను రైతు సంక్షేమ సంఘం, రైస్‌మిల్లర్ల సంఘం సభ్యులు కలిసి తమ సమస్యలు విన్నవించారు. అలాగే జూనియర్ వైద్యులు, కాంట్రాక్ట అధ్యాపకుల సంఘం, వికలాంగుల సంక్షేమ సంఘం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఉద్యోగుల సంక్షేమ సంఘం, తెలుగునాడు, పీడబ్ల్యూ వర్క్‌షాప్ అండ్ ప్రాజెక్టు కార్మిక సంఘాల ప్రతినిధులు సీఎంని కలిసి వినతిపత్రాలు అందజేశారు. అలాగే అధ్వానంగా ఉన్న రోడ్ కం రైలు వంతెనకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని, పుష్కరాలలోపు నాలుగో వంతెన (కొవ్వూరు-కాతేరు)ను పూర్తి చేయాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు సీఎంకు వినతిపత్రం అందజేశారు.

 

 ఘాట్ల పరిశీలన

 రానున్న పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని సీఎం చంద్రబాబు రాజమండ్రిలోని వివిధ ఘాట్లను పరిశీలించారు. గౌత మ ఘాట్‌కు వెళ్లేందుకు సరైన దారి లేకపోవడంతో సీఎంతో పాటు మంత్రులు సైతం అడ్డుగా ఉన్న గోడను దూకాల్సి వచ్చింది. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, రాజమండ్రి మేయర్ రజనీశేషసాయి, శాసనమండలి విప్ చైతన్యరాజు, వికలాంగుల సంక్షేమ శాఖ కార్యదర్శి నీలం సహాని, కమిషనర్ కె.శారదాదేవి, కలెక్టర్ నీతూప్రసాద్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top