కడప ఎడ్యుకేషన్: ఇన్సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఫోర్టో రాష్ట్ర కో చైర్మన్ ఎస్ రామాంజనేయులు డిమాండ్ చేశారు. ఆదివారం కడపలోని ఎస్టీఎఫ్ జిల్లా కార్యాలయంలో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ అనే అంశం పై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సేవలో చేరిన తర్వాత ప్రత్యేక అర్హత పరీక్షలు లేవన్నారు.కానీ ఉపాధ్యాయులకు మాత్రమే టెట్ పరీక్షను తప్పనిసరి చేయడం సమంజసం కాదన్నారు. 20 సంవత్సరాలుగా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్న ఉపాధ్యాయులను ఇప్పుడు మరోసారి పరీక్ష రాయమని చెప్పడం వారి అనుభవాన్ని, సేవలను అవమానపరచడమే అని ఆయన అన్నారు. ఎస్టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆవుల శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇన్–సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి చేసే అంశంపై తీవ్ర చర్చ జరుగుతోందన్నారు. ఈ విషయంలో అనేక రాష్ట్రాల ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. రౌండ్ టేబుల్ సమావేశంలో అన్ని ఉపాధ్యాయ సంఘం నాయకులు పలు అంశాలపై తీర్మానం చేశారు. జూన్ 15, 16 తేదీల్లో ప్లకార్డులతో నిరసన, జూన్ 20 నుంచి ఎంపీలకు ప్రాతినిధ్యాలు అందజేయడం జరుగుతుందన్నారు. సమావేశంలో ఎస్టీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి చంద్రశేఖర్, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ తుపాకుల మురళి, జిల్లా వైస్ ప్రెసిడెంట్ బాలకృష్ణ, జిల్లా కార్యదర్శి నాగేంద్ర, విద్యాసాగర్, శ్రీరాములు పాల్గొన్నారు.


