కడప ఎడ్యుకేషన్: వైఎస్ఆర్ జిల్లాలోని చారిత్రక కట్టడాలు, ప్రాచీన ఆలయాల వైభవాన్ని భవిష్యత్ తరాలకు అందించడమే లక్ష్యంగా భారత జాతీయ కళా సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ సంస్థ (ఇంటాక్) అంకితభావంతో పనిచేస్తోందని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. కడపలోని మానస ఇన్ సమావేశ మందిరంలో ఆదివారం ఇంటాక్ కడప చాప్టర్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ఇంటాక్ కడప చాప్టర్ కన్వీనర్, గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ లయన్ కె. చిన్నపరెడ్డి మాట్లాడుతూ గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు బ్రహ్మంగారిమఠంలో పాక్షికంగా దెబ్బతిన్న శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి నివాస గృహాన్ని (పురాతన కట్టడం) దాని సహజత్వం దెబ్బతినకుండా పునర్నిర్మించే బాధ్యతను ప్రభుత్వం ఇంటాక్ సంస్థకు అప్పగించారన్నారు. భవిష్యత్తులో సంస్కృతి, సంప్రదాయాలు, కళల పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తామన్నారు. మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి,కోటిరెడ్డి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి. సలీం బాషా, ఇంటాక్ కో–కన్వీనర్ పి.వి. సుబ్బారెడ్డి, రాజంపేట చాప్టర్ కన్వీనర్ వెంకటరమణ, డాక్టర్ ఓ.వి. రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


